తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2019, 9:47 PM IST

ETV Bharat / sports

గులాబి వేడుకకు సర్వం సిద్ధం...!

చారిత్రక డే/నైట్​ టెస్టు కోసం ఇప్పటికే ఈడెన్​ గార్డెన్స్​కు చేరుకున్న భారత్​-బంగ్లా జట్లు తీవ్రంగా సాధన చేశాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పిచ్​ను పరిశీలించాడు. అనంతరం ఆసక్తికర ప్రణాళికపై మాట్లాడాడు.

గులాబి వేడుకకు సర్వం సిద్ధం...!

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య తొలి గులాబి బంతి టెస్టు ఓ వేడుకలా జరగనుంది. ఇప్పటికే బంగాల్​లోని ఈడెన్​ గార్డెన్స్​కు చేరుకున్న ఇరుజట్లు నెట్స్​లోతీవ్రంగాసాధన చేశాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పిచ్​ పరిస్థితిని సమీక్షించాడు. తాజాగా సుందరంగా తయారైన మైదానం వీడియోను షేర్​ చేసింది భారత బోర్డు.

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ... ప్రాక్టీస్​ సమయంలో పేసర్​ షమి బౌలింగ్​ను ఎదుర్కొన్నాడు. బంగ్లా బౌలర్​ ముస్తాఫిజుర్​ రెహ్మన్​ కూడా నెట్స్​లో శ్రమిస్తూ కనిపించాడు.

ప్రణాళిక ఇదే...

ఇప్పటికే రంగురంగుల చిత్రాలతో కొత్త సొబగులు అద్దుకున్న ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆట, పాటల నడుమ ఈ పోరు జరగనుంది. మ్యాచ్‌ విరామంలో గాయనీ గాయకుల ఆటాపాటా, టీమిండియా దిగ్గజాలకు సత్కారాలు ఉంటాయి. రాజకీయ నాయకులు హాజరవుతారు. చారిత్రక డే/నైట్‌ టెస్టు ప్రణాళిక అంతా ఆసక్తికరంగా ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు.

" సచిన్‌ తెందూల్కర్‌, సునీల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తారు. తేనీటి విరామంలో మైదానంలో మాజీ సారథులను ఊరేగిస్తారు. మరో విరామం సహా ఆట ముగిసిన తర్వాత సంగీత విభావరి ఏర్పాటు చేశాం. రెండు జట్లు, మాజీ సారథులు, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అక్కడికి వస్తారు. రునా లైలా, జీత్‌ గంగూలీ సంగీత ప్రదర్శనలు ఉంటాయి. నేనెంతో ఆసక్తిగా ఉన్నాను. నాలుగు రోజుల టికెట్లు అప్పుడే అమ్ముడయ్యాయి"

-- సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

క్రికెట్​ పండగే...

డే/నైట్‌ టెస్టును బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈడెన్‌లో గంట మోగించి ఆరంభిస్తారు. ఈ కార్యక్రమానికి స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, చెస్​ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, ఒలింపిక్‌ ఛాంపియన్‌ అభినవ్‌ బింద్రా తదితరులు హాజరు కానున్నారు. వీరిని బంగాల్‌ క్రికెట్‌ సంఘం సన్మానించనుంది.

గంగూలీ, సచిన్‌, ద్రవిడ్‌, కుంబ్లే, లక్ష్మణ్‌తో కలిసి 40 నిమిషాల చర్చా కార్యక్రమానికి క్యాబ్‌ ఏర్పాట్లు చేసింది. ఈడెన్‌లో 2001లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గురించి వారు మాట్లాడతారు. టాస్‌ వేసే ముందు పారాట్రూపర్స్‌ గాల్లో ఎగిరి రెండు జట్ల సారథులు కోహ్లీ, మొమినుల్‌కు గులాబి బంతులు అందజేస్తారు.

రెండు టెస్టుల సిరీస్​లో మొదటి మ్యాచ్​ గెలిచిన టీమిండియా... ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్​ నవంబర్​ 22 నుంచి 26 వరకు ​జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details