తెలంగాణ

telangana

పింక్​ టెస్టు: తొలిరోజు కోహ్లీసేనదే.. ఆధిక్యంలో భారత్​

By

Published : Nov 22, 2019, 9:27 PM IST

కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా చారిత్రక డే/నైట్‌ టెస్టులో భారత జట్టు ఆధిపత్యం కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్​లో మొదట బౌలర్లు, ఆ తర్వాత బ్యాట్స్​మెన్లు రాణించడం వల్ల టీమిండియా జోరు ప్రదర్శించింది. 68 పరుగుల ఆధిక్యంతో తొలి రోజు ఆట ముగించింది కోహ్లీసేన.

పింక్​ టెస్టు తొలిరోజు భారత్​దే ఆధిక్యం...

ఈడెన్​గార్డెన్స్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టెస్టులో.. తొలిరోజు కోహ్లీసేన ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్​ చేసిన బంగ్లా బ్యాట్స్​మన్లు టీమిండియా పేస్​ బౌలింగ్​కు వణికారు. గులాబి బంతితో ఇషాంత్‌ శర్మ (5/22) చెలరేగడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో... బంగ్లా జట్టు 106 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్​ 3 వికెట్ల నష్టానికి 174 రన్స్​ చేసింది.

ఆరంభం నుంచే పేలవంగా...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాను ఆదిలోనే ఇషాంత్‌ దెబ్బతీశాడు. ఇమ్రుల్‌ కేయస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బంగ్లా సారథి మోమినుల్‌ హక్, మహ్మద్‌ మిథున్‌ ఖాతా తెరవకముందే ఉమేశ్‌ పెవిలియన్‌కు పంపించాడు. బంగ్లా కీలక బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్‌, మహ్మదుల్లా (6) ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడం వల్ల బంగ్లా 38 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.

ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన లిటన్‌ దాస్‌ (24)తో కలిసి షాద్మాన్‌ కొద్దిసేపు పోరాడాడు. షమి వేసిన బౌన్సర్‌ లిటన్‌ తలకు బలంగా తగలడం వల్ల అతడు లంచ్‌ విరామానికి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అతడి స్థానంలో కాంకషన్​ సబ్‌స్టిట్యూట్‌గా మెహదీ హసన్‌ బరిలోకి దిగాడు. లంచ్‌ విరామం తర్వాత బంగ్లా బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్లలో ఓపెనర్ షాద్మాన్‌ ఇస్లామ్‌ (29), లిటన్‌ దాస్‌ (24), నయీమ్‌ హసన్‌ (19) రాణించారు.

ఇషాంత్‌ ధాటికి బంగ్లా 106 పరుగులకే చాపచుట్టేసింది. ఉమేశ్‌ యాదవ్‌ (3/29), షమి (2/36) రాణించారు.

విరాట్​, పుజారా అర్ధశతకాలు..

తొలి ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన టీమిండియా.... మంచి ఆరంభమే అందుకున్నా మయాంక్​(14), రోహిత్​(21) తక్కువకే వెనుదిరిగారు. 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్​ను... ఆ తర్వాత పుజారా, విరాట్​ కలిసి చక్కదిద్దారు. ఈ క్రమంలో పుజారా 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరో ఎండ్​లో ఉన్న విరాట్​ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ... కెరీర్​లో 23వ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆటముగిసే సమయానికి విరాట్​(59*), రహానే(23*) అజేయంగా నిలిచారు. 46 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 174 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. ప్రస్తుతం 68 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

బంగ్లా బౌలర్లలో హొస్సేన్​ 2 వికెట్లు, అల్​ ఆమిన్​​ ఒక వికెట్​ సాధించారు.

రికార్డులు...

కోహ్లీ 5 వేల పరుగులు..

కెప్టెన్​గా టెస్టుల్లో వేగంగా 5వేల పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా​ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 86 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు భారత సారథి. మొత్తంగా 84 టెస్టుల్లో 7100 పరుగులు చేశాడు విరాట్​. ఇందులో 26 శతకాలు, 22 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఇషాంత్​ పాంచ్​ పటాకా...

చారిత్రక భారత తొలి డే/నైట్ టెస్టులో మొదటి వికెట్ ఇషాంత్ శర్మ తీశాడు. ఈ మ్యాచ్​లో బంగ్లా ఓపెనర్ కేయస్​ను(4) ఔట్ చేసి పింక్ బంతితో తొలి వికెట్ తీసిన భారత బౌలర్​గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మరో నలుగురిని ఔట్​ చేసి ప్రతిష్టాత్మక మ్యాచ్​లో పాంచ్​ పటాకా సాధించాడు.

కీపర్​ సాహా @ 100...

బంగ్లా ఓపెనర్ ఇస్లామ్‌(29) ఇచ్చిన క్యాచ్‌ను పట్టడం ద్వారా సాహ... భారత్ తరఫున వంద ఔట్​లు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన ఐదో భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. సాహా వంద డిస్మిసల్స్‌లో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి.

ఈ జాబితాలో ధోనీ(294) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సయ్యద్ కిర్మాణీ(198), కిరణ్‌ మోరే(130), నయాన్‌ మోంగియా(107) వరుసగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details