తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2020, 5:27 AM IST

ETV Bharat / sports

సిరీస్​ డిసైడర్​: గెలుపు కోసం భారత్​-ఆసీస్​ తహతహ

నిర్ణయాత్మక చివరి వన్డేలో నెగ్గి సిరీస్​ను​ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి భారత్​, ఆస్ట్రేలియా జట్లు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

నిర్ణయాత్మక వన్డే.. సై అంటున్న భారత్-ఆస్ట్రేలియా
ట్రోఫీతో భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్లు

కొత్త ఏడాదిలో కీలక సమరానికి సిద్ధమైంది టీమిండియా. ఆస్ట్రేలియాతో తాడో పేడో తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా నేడు(ఆదివారం).. బెంగళూరులో నిర్ణయాత్మక మ్యాచ్​ ఆడనుంది. మరి ఇరుజట్లలో ఎవరు గెలుస్తారో చూడాలి?

భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్లు

ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచి భారత్-ఆస్ట్రేలియా ఊపుమీదున్నాయి. గతేడాది వన్డే సిరీస్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన చూస్తుండగా, సిరీస్​ పట్టేయాలని చూస్తోంది ఆసీస్. రెండు పటిష్ఠ జట్ల మధ్య ఈ మ్యాచ్​ ఉత్కంఠగా సాగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పటిష్ఠమైన బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు మరోసారి ప్రధాన బలంగా మారనుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌ శుభారంభం అందివ్వాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే వీరిద్దరూ రెండో వన్డేలో గాయపడటం వల్ల ఈ మ్యాచ్​కు అందుబాటులో ఉంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

రోహిత్ శర్మ-శిఖర్ ధావన్

భారత టాపార్డర్ బలంగా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్ పాండే, జడేజా అంచనాల మేరకు రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఏ స్థానంలోనైనా రాణిస్తున్న కేఎల్‌ రాహుల్‌.. మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. గత వన్డేలోని బ్యాటింగ్‌ ఆర్డర్‌నే.. ఈ మ్యాచ్​లోనూ కొనసాగించే అవకాశముంది.

ప్రాక్టీసులో విరాట్ కోహ్లీ

టీమిండియా బౌలర్లందరూ సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. వారు ట్రాక్​లోకి వస్తే ఆసీస్‌ను కట్టడి చేయడం కష్టమేమీ కాదన్న భావనలో కోహ్లీసేన ఉంది. రెండు వన్డేల్లోలాగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగొచ్చు.

ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్థాయికి తగ్గట్లు రాణిస్తోంది. తొలి వన్డేలో సాధికార విజయం సాధించింది. రెండో వన్డేలోనూ గెలుపు కోసం పోరాడింది. మూడో వన్డేలో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, గెలిచి సిరీస్‌ను పట్టేయాలని ఫించ్‌సేన పట్టుదలగా ఉంది. బౌలింగ్​లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని, ఈ మ్యాచ్​లో సమష్టిగా రాణించాలని కంగారూలు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details