తెలంగాణ

telangana

ETV Bharat / sports

మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు: రోహిత్

ఇంగ్లాండ్​తో మూడో టెస్టులో భారత్‌ కూడా తప్పులు చేసిందన్నాడు టీమ్​ఇండియా స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ. పిచ్​ పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితే పరుగులు రాబట్టొచ్చని చెప్పాడు.

By

Published : Feb 26, 2021, 12:02 PM IST

IND vs ENG: Pitch was nice to bat on, there were no demons, says Rohit
మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు: రోహిత్

ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ను తప్పుపట్టాల్సిన పని లేదని అన్నాడు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ. నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారని చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్​మ్యాన్.

"ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లే కాకుండా టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కూడా తప్పులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో మేము కూడా సరిగ్గా ఆడలేకపోయాం. పిచ్‌ విషయంలో ఎలాంటి తప్పు లేదు.. దానిపై దెయ్యాలేం లేవు. ఒక్కసారి కుదురుకుంటే ఆ పిచ్‌ మీద పరుగులు చేయొచ్చు."

- రోహిత్ శర్మ, భారత బ్యాట్స్​మన్

అయితే స్పిన్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌ మీద జాగ్రత్తగా ఆడాలని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. "పరుగులు చేయాలంటే కాస్త ఆలోచించాలి. ప్రతీ బంతిని డిఫెన్స్‌ చేయడం కూడా సరికాదు. అలా చేస్తే కొన్నిసార్లు బంతి అనూహ్యంగా తిరిగి వికెట్ల మీదకు దూసుకెళ్తుంది. పరిస్థితులను బట్టి షాట్‌లు ఆడేందుకు కూడా వెనుకాడొద్దు. నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు వికెట్‌ కాపాడుకోవడం ఒక్కటే నా ఉద్దేశం కాదు.. పరుగులు కూడా చేయాలనుకున్నాను. మంచి బంతులను గౌరవిస్తూనే చెడ్డ బంతులను వేటాడా" అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్​లో రోహిత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో గెలుపొంది టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరింత చేరువైంది.

ఇదీ చూడండి:మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

ABOUT THE AUTHOR

...view details