2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్స్నే ప్రజలు గుర్తుంచుకుంటారని.. ఆ టోర్నీలో ఆల్రౌండర్గా గొప్ప ప్రదర్శన చేసిన యువరాజ్ను ఎవరూ పట్టించుకోరని అప్పటి బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకపై ఫైనల్లో గెలిచి, ధోనీసేన ప్రపంచకప్ను ముద్దాడింది. దానికి శుక్రవారానికి(ఏప్రిల్ 2) పదేళ్లు పూర్తయిన సందర్భంలో గంభీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో చాలా మంది అద్భుతంగా ఆడారు కానీ ఎవరికీ సరైన గుర్తింపు దక్కలేదని ఇతడు పేర్కొన్నాడు.
'ధోనీ సిక్స్ తప్ప.. యువరాజ్ గురించి మాట్లాడరు' - cricket news
2011 వన్డే ప్రపంచకప్ను టీమ్ఇండియా సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు ధోనీ కొట్టిన సిక్స్ ముందు యువీ ప్రదర్శన కనుమరుగైందని అభిప్రాయపడ్డాడు.
!['ధోనీ సిక్స్ తప్ప.. యువరాజ్ గురించి మాట్లాడరు' If one six won you the World Cup, Yuvraj Singh would've won six: Gautam Gambhir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11251532-420-11251532-1617355846298.jpg)
'ఆ విజయంలో చాలా మందికి తగిన గుర్తింపు రాలేదు. మునాఫ్, హర్భజన్, నేను, కోహ్లీ, రైనా, యువీ ఇలా ఒక్కొక్కరు ఒక్కోసారి రాణించారు. అందరూ బాగా కష్టపడ్డారు. ఆ చారిత్రక విజయాన్ని ఇప్పుడు గుర్తుచేసుకుంటే యువరాజ్కు సరైన గుర్తింపు దక్కలేదని నా అభిప్రాయం. యువీ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికైనా తన గురించి ఎవరూ మాట్లాడరు. కానీ కచ్చితంగా ఫైనల్లో ధోనీ కొట్టిన చివరి సిక్సర్ గురించి చర్చిస్తారు' అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఆ మ్యాచ్లో శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 48.2 ఓవర్లలో ఛేదించింది. సెహ్వాగ్(0), తెందూల్కర్(18) విఫలమైనా.. గంభీర్(97), కోహ్లీ(35), ధోనీ(91*), యువీ(21*) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరికి నువాన్ కులశేఖర బౌలింగ్లో ధోనీ సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు.