అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన మహిళ, పురుష క్రికెటర్లను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు మరో కొత్త అవార్డును పరిచయం చేయనుంది ఐసీసీ. ఇకపై ప్రతి నెలలో ఆటలో బాగా రాణించిన ఆటగాళ్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' పేరుతో అవార్డులను అందించనుంది. పురుష క్రికెటర్లకు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్, మహిళా క్రికెటర్లకు ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పేరుతో ఈ పురస్కారాలను ఇవ్వనుంది.
భారత్ నుంచి నలుగురు..
ఆస్ట్రేలియాపై రికార్డు సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా నుంచి నలుగురు ఆటగాళ్లు జనవరి నెలకుగానూ నామినేట్ అయ్యారు. పంత్, సిరాజ్లతో పాటు వాషింగ్టన్ సుందర్, నటరాజన్ ఈ జాబితాలో ఉన్నారు. ఇంకా స్టీవ్ స్మిత్(ఆసీస్), జో రూట్(ఇంగ్లాండ్), రెహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గానిస్థాన్), మరిజానే కాప్, డిక్లర్క్(సౌతాఫ్రికా), నీదా దార్(పాకిస్థాన్) కూడా రేసులో ఉన్నారు.
ఓటింగ్ ద్వారా
ఐసీసీ ముందుగా.. ఈ అవార్డులకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తుంది. అభిమానులు తమకిష్టమైన క్రికెటర్కు ఓటు వేయొచ్చు. నామినేట్ అయిన ఆటగాళ్లలో అత్యధిక ఓటింగ్ అందుకున్న క్రీడాకారులు విజేతలుగా నిలిచి.. పురస్కారాలు సొంతం చేసుకుంటారు. ప్రతి నెలా రెండో సోమవారం ఈ అవార్డులను ప్రకటించనుంది ఐసీసీ.