తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 6:41 AM IST

Updated : Nov 12, 2019, 7:21 AM IST

ETV Bharat / sports

ధోనీ పాఠాలు.. దీపక్ మార్కులు.. హ్యాట్రిక్ రికార్డులు

బంగ్లాదేశ్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఏడు పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన దీపక్ చాహర్.. 2018 ఐపీఎల్​ నుంచి వెలుగులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు ధోనీ పర్యవేక్షణలో రాటుదేలాడు.

దీపక్ చాహర్

2010-11 సీజన్​లో హైదరాబాద్ - రాజస్థాన్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. మొదట హైదరాబాద్​ బ్యాటింగ్ చేస్తోంది. దేశవాళీలో పెద్దగా అనుభవం లేని 18 ఏళ్ల కుర్రాడు బౌలింగ్. ఒక్క పరుగుకే ఓపెనర్ వికెట్ పడింది..కాసేపటికే మరొకటి.. ఇంతటితో ఆగలేదు.. బ్యాట్స్​మెన్ వరుసగా అలా వచ్చి ఇలా పెవిలియన్​కు క్యూ కడుతూనే ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్.. 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంది. అందులో 8 వికెట్లు ఆ కుర్రాడే తీశాడు. అతడే దీపక్ చాహర్. ఆదివారం.. బంగ్లాదేశ్​తో మూడో టీ20లోనూ 6 వికెట్లు తీసి, టీ20ల్లో భారత్​ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్.. భారత వాయుదళంలో పనిచేసి రిటైరయ్యారు. చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తితో దీపక్ ఎంతో కష్టపడేవాడని, నెట్స్​లో లక్షసార్లుకు పైగా బౌలింగ్ చేసుంటాడని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో భారత బౌలర్ దీపక్ చాహర్

"మేమిద్దరం కన్న కల ఇప్పటికి తీరింది. ఈ స్థాయికి రావడం కోసం దీపక్ ఎంతో శ్రమించాడు. నెట్స్​లో దాదాపు లక్షసార్లు పైగా బౌలింగ్ చేసుంటాడు" - లోకేంద్ర సింగ్, దీపక్ చాహర్ తండ్రి

ధోనీ పర్యవేక్షణలో రాటు తేలిన చాహర్

ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్ ధోనీతో బౌలర్ దీపక్ చాహర్

ఎప్పటి నుంచో దేశవాళీల్లో ఆడుతున్నప్పటికీ 2018 ఐపీఎల్​ నుంచి వెలుగులోకి వచ్చాడు చాహర్​. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఆ ఐపీఎల్​లో​ పునరాగామనం చేసింది. బౌలర్ దీపక్ చాహర్​​ను పట్టుబట్టి ఎంపిక చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. పుణె తరఫున ప్రాతినిధ్యం వహించినపుడు చాహర్ బౌలింగ్​ నచ్చి, ధోనీ అతడిని చెన్నై జట్టులోకి తీసుకున్నాడు.

తన మీద ధోనీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చాహర్​. గత సీజన్​లో 10 వికెట్లు తీయగా.. ఈ ఏడాది అతడు 22 వికెట్లతో దూసుకెళ్లాడు. స్వింగ్ బౌలరైన దీపక్​.. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని అన్ని రకాల బంతులు సంధించాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్​ తరఫున కీలక బౌలర్ అవుతానడంలో సందేహం లేదు.

మహీ మార్గనిర్దేశం

గతేడాది ఐపీఎల్​లో చెన్నై - పంజాబ్ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. పంజాబ్ గెలవాలంటే 12 బంతుల్లో 39 పరుగులు చేయాలి. మహీ.. చాహర్​కు బంతిచ్చాడు. వరుసగా రెండు నోబాల్స్​ వేశాడు చాహర్. వెంటనే మిస్టర్ కూల్ ధోనీ రంగంలోకి దిగి మార్గనిర్దేశం చేశాడు. మహీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో చివరి బంతికి బ్యాట్స్​మన్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క నోబాల్ కూడా వేయలేదు దీపక్ చాహర్.

ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్ ధోనీతో బౌలర్ దీపక్ చాహర్

ఆరంభంలోనే ఎదురుదెబ్బ

2008లో రాజస్థాన్ తరఫున ఆడేందుకు టాప్ 50 మంది బౌలర్లను ఎంపిక చేసింది ఆ రాష్ట క్రికెట్ అకాడమీ. అయితే అప్పుడు దీపక్ చాహర్​ను తీసుకోలేదు. నిరాశ చెందని చాహర్ తన బౌలింగ్​కు మెరుగుపర్చుకొని రాజస్థాన్​ జట్టులో చోటు సంపాదించాడు. హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఆకట్టుకున్నాడు. నిరంతర గాయాలు, ఫిట్​నెస్ లేమితో అడపాదడపా దేశవాళీ మ్యాచ్​లు ఆడుతూ వచ్చాడు దీపక్.

అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అనంతరం భారత్-ఏలో చోటు దక్కించుకొని ఇంగ్లాండ్, వెస్టిండీస్​తో మ్యాచ్​లు ఆడాడు. చివరికి గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరం కాగా.. దీపక్ చాహర్​కు అవకాశమొచ్చింది. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీ20లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లాడిన చాహర్ 14 వికెట్లు తీశాడు.

Last Updated : Nov 12, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details