తెలంగాణ

telangana

ETV Bharat / sports

సర్​ప్రైజ్ రైనా.. సరిలేరు నీకెవ్వరు - రైనా పుట్టినరోజు

క్రికెటర్ సురేశ్ రైనా.. టీమిండియా తరఫున బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​ ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తాచాటి ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

suresh raina
రైనా

By

Published : Nov 27, 2019, 10:28 AM IST

టీమిండియా క్రికెట్​లో ఎడమచేతి వాటం బ్యాట్స్​మెన్​లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు సురేశ్ రైనా. ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​లతో అభిమానుల్ని అలరించాడు. ఈ క్రికెటర్.. జాతీయ జట్టుకు దూరమై చాలా కాలమైంది. ఎప్పటికైనా పునరాగమనం చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్​లో రైనా మెరుపుల్ని చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆటగాడి పుట్టినరోజు సందర్భంగా అతడి క్రికెట్ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.

మొదటి మ్యాచ్​లోనే డకౌట్

2005 జులై 30న శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో రైనా.. అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడు. కానీ డకౌట్​గా వెనుదిరిగి నిరాశపర్చాడు. అనంతరం టెస్టు ఎంట్రీ లంకపైనే చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో సుస్థిర స్థానం సంపాదించాడు. కెరీర్​ మొత్తంగా టెస్టుల్లో 768, వన్డేల్లో 5,615, టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు.

హర్భజన్, రైనా

మొదటి ప్రశంసలు రైనా నుంచే

భారత్​ క్రికెట్​ జట్టులో బౌలర్ వికెట్ తీసినా, ఫీల్డర్ క్యాచ్​ పట్టినా, రనౌట్ చేసినా మొదటి ప్రశంస వచ్చేది రైనా నుంచే. వికెట్ పడిన సమయంలో రైనా మైదానంలో ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుందని చాలాసార్లు నిరూపితం చేశాడు. 2015 ప్రపంచకప్​లో జరిగిన సంఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ టోర్నీలో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ 99 పరుగుల వద్ద సింగిల్ తీశాడు. అవతలి ఎండ్​లో రైనా ఉన్నాడు. కోహ్లీ పరుగు పూర్తి కాకముందే రైనా అతడి కంటే ముందు అభివాదం చేస్తూ ఉత్సాహంతో వచ్చాడు. అప్పుడు కెమెరాలన్నీ రైనా వైపు మళ్లాయి. అంటే విరాట్ కంటే ముందే అతడి సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు రైనా.

రైనా ఆనందం

జట్టుపై అమితమైన ప్రేమ

టీమిండియాలో రైనాకు సుస్థిరమైన బ్యాటింగ్ స్థానం లేదనే చెప్పాలి. అతడి కెరీర్​లో టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్​లో ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా చేసేవాడు. ప్రస్తుతం జట్టుకు దూరమైనా.. టీమ్​ గెలిచిందంటే సామాజిక మాధ్యమాల వేదికగా తప్పకుండా ప్రశంసిస్తాడు.

రైనా

నిబద్ధత గల ఆటగాడు

నిబద్ధత గల క్రికెటర్ల పేర్లు చెప్పమంటే అందులో సురేశ్ రైనా ముందు వరుసలో ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం అతడికి అలవాటు. ఫీల్డింగ్​లో సాధ్యమైనన్ని పరుగులు నియంత్రించడమే లక్ష్యంగా, మైదానంలో చురుగ్గా కదులుతుంటాడు. ఐపీఎల్​లో విరామం లేకుండా 158 మ్యాచ్​లు ఆడాడంటేనే అతడి నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.

రైనా, యువరాజ్

2014 ఐపీఎల్ ఇన్నింగ్స్

ఐపీఎల్ చరిత్రలోనే ఇదో మరపురాని ప్రదర్శన. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రైనా తన విశ్వరూపాన్ని చూపించాడు. 2014 ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లోని క్వాలిఫయర్ 2లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. పంజాబ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122) చెలరేగి ఆడటం వల్ల ఆ జట్టు 226 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ డకౌట్. మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ చేసింది 7 పరుగులే. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రైనా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఈ 87 పరుగుల్లో 33 పరుగులు ఒకే ఓవర్‌లో రాబట్టడం విశేషం. పర్వీందర్ ఆవానా వేసిన ఆరో ఓవర్‌లో రైనా బంతిని ఉతికి ఆరేశాడు.

ఆరు బంతుల్ని వరుసగా 6, 6, 4, 4, 4(నోబాల్), 4, 4గా మలిచాడు రైనా. ఈ మ్యాచ్‌లో ఇతడితో పాటు ధోనీ (31 బంతుల్లో 42 నాటౌట్) మెరిసినా చెన్నై గెలవలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. రైనా ఇన్నింగ్స్ మాత్రం చెన్నై అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

కొసమెరుపు: వన్డే, టెస్టు, టీ20, వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ టీ20లో సెంచరీ చేసిన ఒకే ఒక్క భారత ఆటగాడు రైనా.

ఇవీ చూడండి.. ఆస్ట్రేలియా క్రికెట్​లో విషాదానికి ఐదేళ్లు

ABOUT THE AUTHOR

...view details