తెలంగాణ

telangana

ETV Bharat / sports

4 రోజుల టెస్టుపై బోర్డు ఓ వైపు.. క్రికెటర్లు మరోవైపు - Ricky Ponting news

టెస్టుల నిడివిని అయిదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించాలన్న ఐసీసీ ప్రతిపాదనను సచిన్​ వ్యతిరేకించిన కొద్ది గంటల్లోనే... ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్​ అదే నిర్ణయాన్ని చెప్పాడు. టెస్టుల్లో మార్పునకు మద్దతిస్తున్నవారు సరైన కారణం చెప్పాలని కోరాడు. ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా బోర్డు సుముఖంగా ఉండగా.. ఆటగాళ్లు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేయడం విశేషం.

Former Australia captain Ricky Ponting to express his disapproval against four-day Test matches
4 రోజుల టెస్టుపై బోర్డు ఒకవైపు.. ఆటగాళ్లు మరోవైపు..

By

Published : Jan 5, 2020, 8:46 PM IST

నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించాడు ఆస్ట్రేలియా క్రికెట్​ దిగ్గజం రికీ పాంటింగ్​. దీని వల్ల ఎక్కువ మ్యాచ్​లు ఫలితం తేలకుండా డ్రా అయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

"నేను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా. నాలుగు రోజుల టెస్టుకు మద్దతిస్తున్నవారు సరైన కారణం ఒకటి చెప్పండి. ఈ మధ్య కాలంలో నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్​లు చాలానే ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్ని డ్రా అయ్యాయి? టెస్టులను పూర్తిగా నాలుగురోజులకే పరిమితం చేస్తే.. ఎక్కువ శాతం మ్యాచ్​లు సమమవుతాయి. ఇదే ఎవ్వరూ పరిశీలించని అంశం. ఇందులోనూ కమర్షియల్​గా చూస్తే కొంత లాభం ఉండొచ్చు. అవి ఎలా ఉంటుందంటే గురువారం వచ్చి ఆదివారం వెళ్లిపోయినట్లు ఉంటుంది"
-- రికీ పాంటింగ్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

అంతకుముందు ఇదే అంశంపై మాట్లాడిన సచిన్​... కొత్త తరాన్ని ఆకర్షించడానికి ప్రతీది మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు​. క్రికెట్‌లో వన్డేలు, టీ20లు, టీ10లు, 100 బాల్స్‌ ఫార్మాట్‌లు ఉన్నాయని చెప్పిన మాస్టర్​... క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్ స్వచ్ఛమైన రూపమన్నాడు. సంప్రదాయమైన ఈ ఫార్మాట్‌ నిడివిని తగ్గించకూడదని చెప్పాడు.

2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. దీనిపై ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ బోర్డులు సుముఖంగా ఉన్నా... క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత సారథి విరాట్‌ కోహ్లీ,మాజీ క్రికెటర్​ గంభీర్​, ఆస్ట్రేలియా కెప్టెన్‌ పైన్‌, స్పిన్నర్‌ లైయన్‌ వంటి ఎందరో ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

ABOUT THE AUTHOR

...view details