పరాజయం దిశగా సాగినా గొప్పగా పుంజుకున్న ఇంగ్లాండ్ తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. వోక్స్ (84 నాటౌట్), బట్లర్ (75) పోరాడడం వల్ల నాలుగో రోజు, శనివారం.. 277 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి ఛేదింది. యాసిర్ షా మాయాజాలానికి ఓ దశలో ఇంగ్లాండ్ 117 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. వోక్స్, బట్లర్ ఆరో వికెట్కు 139 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యాసిర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పాకిస్థాన్ (ఓవర్నైట్ 137/8) రెండో ఇన్నింగ్స్లో 169 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో పాక్ 326 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 219 పరుగులకే ఆలౌటైంది. వోక్స్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
బతికించిన బట్లర్, వోక్స్:
టెస్టు క్రికెట్లో 270పై లక్ష్యమంటే చాలా కష్టమే. పెను సవాలుతో కూడుకున్నదే. ఆపై ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. 117కే అయిదు వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకున్నట్లే కనిపించింది. కానీ బట్లర్, వోక్స్ల పోరాటానికి తలవంచుతూ పాకిస్థానే ఓ అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. ఛేదనలో ఆరంభంలోనే ఇంగ్లాండ్కు దెబ్బతగిలింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్ బర్న్స్ (10)ను అబ్బాస్ వెనక్కి పంపాడు. అయినా సిబ్లే (36), కెప్టెన్ రూట్ (42) నిలబడటం వల్ల పాకిస్థాన్ 86/1తో మెరుగ్గానే కనిపించింది. కానీ సాఫీగా సాగుతున్న దశలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. లెగ్స్పిన్నర్ యాసిర్ షా స్పిన్ ఉచ్చులో చిక్కిన ఆ జట్టు 31 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ముందు సిబ్లేను ఔట్చేయడం ద్వారా.. బలపడుతున్న రెండో వికెట్ భాగస్వామ్యాన్ని యాసిర్ విడదీశాడు. పది పరుగుల తర్వాత రూట్ను నసీమ్ షా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రమాదకర బెన్ స్టోక్స్ (9)ను వెనక్కి పంపి.. పాక్ శిబిరంలో యాసిర్ ఆనందం నింపాడు. కాసేపటికే పోప్నూ ఔట్చేశాడు. 117కే అయిదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ పరాజయం ఖాయమనిపించింది.
ఇంగ్లాండ్-పాకిస్థాన్ తొలి టెస్టు పాక్లోనూ గెలుపు ధీమా. కానీ దృఢ సంకల్పంతో క్రీజులో పాతుకుపోయిన బట్లర్, వోక్స్లు పాక్ ఆశలపై నీళ్లు చల్లారు. బంతిని గింగిరాలు తిప్పుతున్న యాసిర్ను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను నడిపించారు. వేగంగానే పరుగులు రాబట్టారు. టీ సమయానికి 167/5తో ఇంగ్లాండ్ కాస్త కోలుకుంది. కానీ అప్పటికీ పాకిస్థాన్కే మెరుగైన అవకాశాలు. అయితే అప్పటికి బట్లర్, వోక్స్ కూడా క్రీజులో కుదురుకున్నారు.
టీ తర్వాత చక్కని బ్యాటింగ్ను కొనసాగించారు. ఇంగ్లాండ్ స్కోరు 250 కూడా దాటింది. ఇక ఇంగ్లాండ్ విజయం ఖాయమే అనుకున్న దశలో బట్లర్ను ఔట్ చేయడం ద్వారా పాక్లో యాసిర్ షా ఆశలు రేపాడు. అప్పటికి స్కోరు 256. మ్యాచ్లో కాస్త ఉత్కంఠ. పాక్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. కానీ వోక్స్.. బ్రాడ్తో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే 273 వద్ద బ్రాడ్ (7) కూడా ఔటవడం వల్ల ఇంకాసేపు ఉత్కంఠ తప్పలేదు. అయితే షహీన్ షా అఫ్రిది బౌలింగ్తో వోక్స్ ఫోర్తో ఇంగ్లాండ్ విజయతీరాలకు చేరింది.