టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లీష్ జట్టుకు 2015 తర్వాత సొంతగడ్డపై సిరీస్ ఓటమి రుచి చూపించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. గ్లెన్ మాక్స్వెల్ (108; 90 బంతుల్లో 4×4, 7×6), అలెక్స్ కారే (106; 114 బంతుల్లో 7×4, 2×6) శతకాలతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో గెలిచి చూపించింది.
ఛేదనలో ఆసీస్కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 21 వద్దే ఆరోన్ ఫించ్ (12) వోక్స్ బౌలింగ్లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (24), స్టోయినిస్ (4), లబుషేన్ (20), మిచెల్ మార్ష్ (2) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో 73/5తో కంగారూలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలోనే ఆసీస్ ఆపద్బాంధవుడు గ్లెన్ మాక్స్వెల్ క్రీజులోకి దిగాడు. అలెక్స్ కారేతో కలిసి సమయోచితంగా ఆడాడు. కారే నిలకడగా ఆడగా మాక్సీ మాత్రం దంచుడే పనిగా పెట్టుకున్నాడు. 48 బంతుల్లో 50, 84 బంతుల్లో శతకం బాదేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కారే ఆచితూచి ఆడుతూ శతకం బాదడం వల్ల వీరిద్దరూ ఆరో వికెట్ కు 212 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 285 వద్ద మాక్సీ, 293 వద్ద కేరీ వెనుదిరిగారు. చివర్లో కమిన్స్ (4*), స్టార్క్ (11*) అవసరమైన పరుగులు చేసి విజయం అందించారు.