తెలంగాణ

telangana

ETV Bharat / sports

నెట్స్​లో ధోనీ ప్రాక్టీస్... రిటైర్మెంట్​ వార్తలకు తెరదించినట్లేనా..!

టీమిండియా మాజీ సారథి ధోనీ భవిష్యత్తుపై ఓ పక్క అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అతడి అవకాశాలూ సన్నగిల్లుతూనే ఉన్నాయి. తాజాగా ఈ స్టార్​ క్రికెటర్​ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టునూ కోల్పోవడం వల్ల అతడి రిటైర్మెంట్‌పై చర్చ ఊపందుకుంది. ఇలాంటి సమయంలో మళ్లీ బ్యాట్​కు పనిచెప్పాడు మహీ. రాంచీ మైదానంలో తాజాగా ప్రాక్టీస్​ చేస్తూ కనిపించాడు. ఫలితంగా అతడు క్రికెట్​లోకి రీఎంట్రీ ఇస్తాడని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.

By

Published : Jan 17, 2020, 10:42 AM IST

Updated : Jan 17, 2020, 10:54 AM IST

Dhoni Practice in Nets with Jharkhand Ranji team After lost central contract of BCCI
మహీ మళ్లీ బ్యాట్​ పట్టాడు... ఆశలు చిగురిస్తున్నాయ్​...

రంజీ ఆటగాళ్లతో ప్రాక్టీస్​ చేస్తున్న ధోనీ
భారత స్టార్​ క్రికెటర్, మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ కథ క్లైమాక్స్​కు చేరిందని అందరూ భావిస్తున్న తరుణంలో... మళ్లీ మైదానంలో కనిపించాడు మహీ. శుక్రవారం రాంచీ మైదానంలో నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తూ కనిపించాడు. ఆ రాష్ట్ర రంజీ ఆటగాళ్లతో కలిసి నెట్స్​లో సాధన చేశాడు మిస్టర్​ కూల్​. ఫలితంగా అతడు టీ20 ప్రపంచకప్​లో చోటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఫిట్​నెస్​ మెరుగుపర్చుకునేందుకు జిమ్​లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడట ఈ స్టార్​ క్రికెటర్​. ఈ నెల 19న రాంచీ-ఉత్తరాఖండ్​ మధ్య రంజీ మ్యాచ్​లో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.

అనూహ్యంగా బీసీసీఐ నిర్ణయం..

ధోనీ రిటైర్మెంట్‌పై కొంతకాలంగా వస్తోన్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చే పరిణామం జనవరి 16న చోటు చేసుకుంది. అతడికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కలేదు. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు కాలానికి కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన బోర్డు... అందులో నుంచి ధోనీ తప్పించింది. అయితే ఇదంతా మహీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు. 2019 నుంచి ఒక్క మ్యాచ్​ ఆడలేదనే కారణంతో ధోనీ కూడా పేరు తీసేయాలని చెప్పినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

రవిశాస్త్రి వ్యాఖ్యలతో చర్చ...

గతేడాది జులైలో న్యూజిలాండ్‌తో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత నుంచి ధోనీ... అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అప్పట్నుంచి ఈ మాజీ సారథి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అతడి వన్డే కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లేనని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఇటీవలే ప్రకటించడం చర్చనీయాంశమైంది. తాజాగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలోనూ ధోనీ పేరు లేకపోవడం రవిశాస్త్రి ప్రకటనకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌ గురించి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. తన మనసులోని మాటను బయటపెట్టలేదు. రానున్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ బరిలో దిగుతాడని అందరూ అనుకుంటున్నారు. అతడు టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా బోర్డు వర్గాలు ఇటీవలె పరోక్షంగా వెల్లడించాయి.

ప్రాక్టీస్​లో ధోనీ

38 ఏళ్ల ధోనీ గతేడాది వరకు రూ.5 కోట్లు వార్షిక చెల్లింపు ఉన్న 'ఎ' విభాగంలో ఉన్నాడు. 2004 డిసెంబరు 23న అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహీ... ఇప్పటిదాకా 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి 17000 పైచిలుకు పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గా 829 ఔట్లలో భాగమయ్యాడు.

Last Updated : Jan 17, 2020, 10:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details