తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​ ఫైనల్లో రెండోసారి టాస్​ వేయించిన ధోనీ'

28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో 2011 వన్డే ప్రపంచకప్​ను రెండోసారి ముద్దాడింది టీమ్​ఇండియా. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ.. రెండు సార్లు టాస్​ వేయించిన విషయం తాజాగా వెల్లడించాడు లంక సారథి కుమార సంగక్కర. భారత సీనియర్​ బౌలర్​‌ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న సంగా.. అప్పుడు జరిగిన ముచ్చటను వివరించాడు.

By

Published : May 29, 2020, 11:51 AM IST

Dhoni asked for second time toss in 2011 World Cup final
'ప్రపంచకప్​ ఫైనల్లోనే రెండోసారి టాస్​ వేయించిన ధోనీ'

.

గెలిచిన ఆనంతరం ధోనీని హత్తుకున్న యువరాజ్​

అది 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌. 28 ఏళ్ల తర్వాత భారత్‌ రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన సందర్భం. నువాన్‌ కులశేఖర బౌలింగ్‌లో 49వ ఓవర్‌ రెండో బంతికి నాటి సారథి మహేంద్రసింగ్‌ ధోనీ.. స్టాండ్స్‌లోకి బంతిని సంధించిన వేళ. నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న యువీ పరిగెత్తుకుంటూ వచ్చి ధోనీని హత్తుకున్న సమయం. సరిగ్గా అప్పుడే.. వారి వెనకాలే.. శ్రీలంక కెప్టెన్‌ కుమార సంగక్కర చిరునవ్వు చిందిస్తూ నడుచుకుంటూ వచ్చాడు. ఆ ఫొటో అప్పట్లో సామాజిక మాధ్యమాలో వైరల్‌ అయింది. త్రుటిలో ప్రపంచకప్‌ చేజారినా చిరునవ్వుతో ఆ ఓటమిని స్వీకరించడం వెనుక మాటల్లో చెప్పలేని బాధ దాగుందని చెప్పాడు. తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్​లో మాట్లాడిన సంగక్కర 2011 వన్డే ప్రపంచకప్‌ నాటి విశేషాలను పంచుకున్నాడు.

ఆడితే గెలవాలనుకుంటాం

"మేం మ్యాచ్‌ ఆడినప్పుడల్లా గెలవాలనే అనుకుంటాం. మాది గట్టి పోటీనిచ్చే జట్టు. మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా.. ఆ ఫలితాన్ని ఎలా స్వీకరించాలి అనే దానిపైనే దృష్టిసారిస్తాం. ఆ చిరునవ్వు.. నిరాశతో కూడిన ఎంతో బాధను కప్పిపుచ్చింది. దాని వెనుక రెండు కోట్ల మంది లంకేయుల ఆశలు ఉన్నాయి. 2007, 2011లో శ్రీలంకకు వన్డే ప్రపంచకప్‌లు గెలిచే అవకాశం వచ్చింది. అలాగే 2009, 2012లోనూ టీ20 ప్రపంచకప్‌లు సాధించే అవకాశం ఉండింది. ఫలితం ఏదైనా జీవితమంటే ఇలాగే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం అందరికీ అనుకూలంగా ఉండదు, ఎలా ఉన్నా దాన్ని స్వీకరించడమే ముఖ్యం. మా జట్టు గెలుపులతో మరీ విర్రవీగిపోదు.. అలాగే ఓటములతో మరీ కుంగిపోదు" అని సంగక్కర వివరించాడు.

ధోనీ ఇంకోసారి టాస్‌ వేద్దామన్నాడు

నాటి మ్యాచ్‌లో సంగక్కర టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. జయవర్ధనే (103*) శతకంతో ఆదుకున్నాడు. ఛేదనలో గంభీర్‌(97), ధోనీ(91*) రెచ్చిపోవడం వల్ల టీమ్‌ఇండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఆ రోజు రెండుసార్లు టాస్‌ వేశామని సంగక్కర గుర్తుచేసుకున్నాడు.

తొలుత టాస్‌ వేసినప్పుడు అభిమానుల సందడి మధ్య తాను 'టెయిల్స్‌' చెప్పినా ధోనీకి వినపడలేదన్నాడు. దాంతో రెండోసారి వేయాల్సి వచ్చిందని.. అయితే శ్రీలంకలో తనకు ఇలాంటి ఇబ్బంది ఉండదన్నాడు. భారత్‌లోనే ఇలా జరుగుతుందని చెబుతూ ఒకసారి ఈడెన్‌గార్డెన్స్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని వివరించాడు.తన పక్కనే ఉన్న తొలి స్లిప్‌ ఫీల్డర్‌తో మాట్లాడినా అతడికి వినపడలేదన్నాడు.

టాస్​ వేస్తున్నసమయంలో ధోనీ, సంగక్కర

"ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీ టాస్‌ వేయగానే నేను టెయిల్స్‌ అని చెప్పాను. అతనికి వినపడలేదు. దాంతో 'నువ్వు టెయిల్స్‌ అన్నావా' అని ధోనీ నన్నడిగాడు. అందుకు నేను జవాబిస్తూ.. 'కాదు టెయిల్స్‌ అన్నానని' చెప్పాను. చివరికి మ్యాచ్‌ రిఫరీ కలగచేసుకొని నేను టాస్‌ గెలిచానని చెప్పినా ధోనీ ఒప్పుకోలేదు. మళ్లీ వేద్దామన్నాడు. అలా రెండోసారి టాస్‌ పడింది"

-- సంగక్కర, శ్రీలంక మాజీ సారథి

ఒకవేళ తాను టాస్‌ ఓడిపోయింటే.. టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉండేదని చెప్పాడు. తర్వాత తాము ఛేదనలో విజయం సాధించేవాళ్లమని ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటికే వాంఖడేలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ఆడినందున రెండో ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావంతో తాము గెలిచేవాళ్లమని చెప్పాడు.

ఇదీ చూడండి: మరపురాని మెరుపులు: చిన్నస్వామిలో భారత్​ గెలిచిన వేళ

ABOUT THE AUTHOR

...view details