దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో విభేదాలు బహిర్గతమయ్యాయి. అంతర్గతంగా నెలకొన్న కారణాల వల్ల ఆ సంఘం అధ్యక్షుడు రజత్శర్మ రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో 20 నెలలు కొనసాగిన ఆయన... అనూహ్యంగా పదవికి గుడ్బై చెప్పేశారు. అయితే ఆ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిపారు డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్. ఈ అంశంపై బోర్డు అత్యున్నత మండలి(అపెక్స్ కౌన్సిల్) తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారాతో నెలకొన్న బహిరంగ విభేదాలే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు రజత్ శర్మ ట్వీట్ చేశారు.
"క్రికెట్ పరిపాలన అన్ని సమయాల్లోనూ ఒత్తిడితో ఉంటుంది. క్రికెట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాలు ఎప్పుడూ పనిచేయవు. నా నిబద్ధత, నిజాయితీ మరియు పారదర్శకత పాలన వల్ల డీడీసీఏలో కొనసాగడం సాధ్యం కావడం లేదు. ఈ విషయాల్లో నేను ఎంతమాత్రం రాజీ పడటానికి ఇష్టపడట్లేదు"
--రజత్శర్మ, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు
అధ్యక్ష హోదాలో విధులు న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చాలా సమస్యలు వస్తున్నాయని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు రజత్.
మరో ముగ్గురు...
రజత్ శర్మపై ఉన్న గౌరవంతో డీడీసీఏ సీఈఓ రవి చోప్రా, క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లో సభ్యులుగా ఉన్న సునీల్ వాల్సన్, యశ్పాల్ శర్మ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అతుల్ వాసన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ కెపీ భాస్కర్... రంజీ ట్రోఫీ జట్టుకు సేవలందిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.