సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై వదంతులు వ్యాప్తి చేసిన ఓ నెటిజన్కు... పరోక్షంగా చురకలు అంటించింది చెన్నై సూపర్కింగ్స్. అతడికి ఘాటుగా సమాధానమిచ్చింది.
ఇదీ జరిగింది..!
ఇటీవల ఝార్ఖండ్ క్రికెట్ మైదానంలో మహీ నెట్స్లో ప్రాక్టీస్ చేయడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే మహీ ఆటను మళ్లీ చూస్తామని మురిసిపోయారు. ఇదే సమయంలో నవంబర్ 15న ఐపీఎల్లోని ఫ్రాంచైజీల ట్రేడింగ్ విండో ముగిసింది. ఆ తర్వాత అట్టి పెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ఆయా జట్ల యాజమాన్యాలు వెల్లడించాయి. అయితే జట్ల వివరాల ప్రకటనకు ఒక రోజు ముందు ఓ నెటిజన్..."ఎంఎస్ ధోనీకి చెన్నై సూపర్కింగ్స్ గుడ్బై చెప్తోందని సన్నిహిత వర్గాల సమాచారం" అని ట్వీట్ చేశాడు. సీఎస్కే మహీని అట్టిపెట్టుకోకుండా వదిలేస్తోందని రాశాడు.
ఈ విషయంపై ఆ ఫ్రాంచైజీ ఘాటుగా స్పందించింది. "సన్నిహిత వర్గాలకు గుడ్బై చెప్పే సమయం ఆసన్నమైంది" అని బదులిచ్చింది. ధోనీపై మరో వదంతి ప్రచారం కాకుండా అడ్డుకుంది. మోహిత్ శర్మ, శామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే, స్కాట్ కుగిలీన్, ధ్రువ్ షోరె, చైతన్య బిష్ణోయిలను విడిచిపెట్టేసింది సీఎస్కే. కానీ 'డాడీస్ ఆర్మీ'లోని కీలక సభ్యులను అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం 14.6 కోట్ల మిగులు నిధులతో 2020 ఐపీఎల్ వేలానికి సిద్ధంగా ఉంది.
చెన్నై సూపర్కింగ్స్
అట్టి పెట్టుకుంది: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మోను కుమార్, ఎన్ జగదీశన్, హర్భజన్సింగ్, కర్ణ్శర్మ, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్.