తెలంగాణ

telangana

చారిత్రక డే/నైట్​ టెస్టుకు అతిథులుగా మమతా, హసీనా

By

Published : Nov 9, 2019, 3:08 PM IST

భారత్​-బంగ్లా మధ్య ఈ నెల 22 నుంచి జరగనున్న తొలి డే/నైట్​ టెస్టుకు అతిథులుగా బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హాసీనా, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. ఈడెన్​లో మ్యాచ్​ ప్రారంభానికి ముందు వీరు మైదానంలోని గంటను మోగించనున్నారు.

చారిత్రక డే/నైట్​ టెస్టుకు అతిథులుగా మమతా, హసీనా

భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య ఈ నెల 14 నుంచి టెస్ట్‌ సిరీస్‌ మొదలు కానుంది. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నవంబర్ 22న రెండో టెస్టు మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఇది డే/నైట్ టెస్టు కావడం విశేషం. ఈ రెండు జట్లు ఇప్పటివరకు డే/నైట్ టెస్టు ఆడలేదు.

ఇక్కడ మ్యాచ్​ను ప్రారంభించే ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. నవంబరు 22 నుంచి 26 వరకు జరగనున్నఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు బంగ్లా ప్రధాని వస్తున్నట్లు బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(క్యాబ్‌) తాజాగా వెల్లడించింది.

దిగ్గజాల రాక..

ఈ మ్యాచ్​కు భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​, ఒలింపిక్​ ఛాంపియన్​ అభినవ్​ బింద్రా, టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ పీవీ సింధు, ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​ మేరీకోమ్​ సహా పలువురు భారత జట్టు టెస్టు సారథులు హాజరుకానున్నారు.

దాదానే ఆధ్యుడు​..

దాదా బంగాల్ క్రికెట్​ సంఘం అధ్యక్షుడైన తర్వాత 2016లో ఈడెన్​లో గంట ఏర్పాటు చేశాడు. అప్పట్నుంచి గంట మోగించిన తర్వాతే ఆట మొదలు పెడుతున్నారు. తొలిసారి ఆ గంటను మోగించిన వ్యక్తిగా కపిల్​దేవ్​ రికార్డుల కెక్కాడు. భారత్​-న్యూజిలాండ్​ మధ్య 2016లో ఈ టెస్టు జరిగింది.

మ్యాచ్​కు ముందు గంట మోగిస్తున్న కపిల్​ దేవ్​, పక్కనే క్యాబ్​ అధ్యక్షుడు గంగూలీ

క్రికెట్​ మ్యాచ్​లకు ప్రధాని హాజరుకావడం కొత్తేమి కాదు. 2011 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. ఆయన ఆ మ్యాచ్‌ను తిలకించారు. భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు నాటి పాకిస్థాన్‌ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ కూడా హాజరయ్యారు. ఇక భారత్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, రెండు టెస్టుల సిరీస్‌ కోసం నవంబరు 3న అడుగుపెట్టింది బంగ్లా జట్టు. ఇప్పటికే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ 1-1తో సమమైంది. ఇరుజట్ల మధ్య ఆఖరి మ్యాచ్​ నాగపూర్​ వేదికగా ఆదివారం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details