తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2019, 8:44 PM IST

Updated : Oct 27, 2019, 9:04 PM IST

ETV Bharat / sports

భారత్​-బంగ్లాదేశ్​: ఈడెన్ టెస్టులో 'గులాబీ బంతి'..!

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య నవంబర్​ 22న ప్రారంభంకానున్న రెండో టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కానుంది. ఈ మైదానంలో గులాబీ బంతిని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే ఈ విషయాన్ని బంగ్లా క్రికెట్​ బోర్డుకు చెప్పగా... వాళ్ల నిర్ణయం కోసం వేచి చూస్తోంది గంగూలీ సేన.

భారత్​-బంగ్లాదేశ్​: ఈడెన్ టెస్టులో 'గులాబి బంతి'..!

ఈడెన్​ వేదికగా భారత్​-బంగ్లా మధ్య జరగనున్న రెండో టెస్టులో సరికొత్త బంతి దర్శనమిచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్​ను డే అండ్​ ​నైట్​గా నిర్వహించి, గులాబి బంతిని వాడేందుకు బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు(బీసీబీ)తో చర్చలు జరుపుతోంది బీసీసీఐ. ఇందులో బంగ్లా బోర్డు నిర్ణయం కీలకం కానుంది.

గులాబి బంతి

"రెండో టెస్టును డే/నైట్​ మ్యాచ్​గా నిర్వహిద్దామని బీసీసీఐ కోరింది. మేము కొంత సమయం కావాలని అడిగాం. ఇప్పటికైతే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి లేదా రెండు రోజుల్లో మా అభిప్రాయం తెలియజేస్తాం".
--అక్రమ్​ ఖాన్​, బీసీబీ బోర్డు అధికారి​

యాజమాన్యం, ఆటగాళ్లతో ఓసారి చర్చించాక కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని అక్రమ్​ తెలిపాడు.

గంగూలీ ఆసక్తిగా...

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరభ్​ గంగూలీ... గులాబీ బంతిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కోహ్లీ కూడా ఈ నిర్ణయానికి మద్దతిచ్చాడు. పింక్‌ బాల్‌తో టెస్టు నిర్వహణకు మంచిదని అభిప్రాయపడిన మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే... ఈ విషయంలో వాతావరణం, వేదిక, మ్యాచ్‌ జరిగే రోజులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నాడు. మంచు కారణంగా రాత్రి పూట బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోతే కాస్త సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పాడు.

గతంలో భారత్​ నో...

మూడేళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటించే ప్రతి జట్టు.. గులాబి బంతితోనే డే/నైట్​ టెస్టు ఆడుతున్నాయి. 2018 డిసెంబరు​లో అడిలైడ్​ వేదికగా ఆస్ట్రేలియా, భారత్​ ఆడాల్సింది. కానీ పింక్​బాల్​తో ఆట ఆడాలన్న క్రికెట్​ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించింది.

అడిలైడ్​లో డే/నైట్​ టెస్టు
  • గులాబి బంతి దెబ్బతినకుండా ఎక్కువ మన్నిక వచ్చేందుకు వికెట్​పై అదనపు పచ్చిక ఉంచుతారు. ఇలా పిచ్​పై పచ్చిక అదనంగా ఉంటే సీమర్లకు అనుకూలిస్తుంది. ఆసీస్​లో పొడగరి, బలమైన పేసర్లు ఉన్నారు. దీని వల్ల మ్యాచ్​ ఆసీస్​కు అనుకూలంగా మారుతుందని భారత బోర్డు భావించింది.
  • ఎక్కువ సేపు ఈ బంతిని ఉపయోగించడం వల్ల రంగు మారి ఫ్లడ్​లైట్ల వెలుగులో కనిపించదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో న్యూజిలాండ్​తో మ్యాచ్​తోనూ బంగ్లాదేశ్​ ఇలానే గులాబి బంతిపై నిరాశక్తి వ్యక్తం చేసింది.

2016 సీజన్‌ దులీప్‌ ట్రోఫీలో భారత్‌ మొదటిసారి గులాబి బంతిని వాడింది. అయితే టీమిండియా మాత్రం వీటిని ఉపయోగించలేదు. ఈ ఏడాది జరిగిన దేశవాళీ ట్రోఫీలోనూ ఫైనల్​లో గులాబీ వాడాల్సి ఉన్నా... దాన్ని కాదని సంప్రదాయ పద్దతిలోనే ఎర్ర బంతితోనే మ్యాచ్​ జరిగింది.

ఇప్పుడెందుకు..?

ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్​లో అభిమానులు పెద్దగా స్టేడియానికి రాలేదు. విద్యార్థులకు ఉచిత పాస్‌లు ఇచ్చినా మూడు వేదికల్లోనూ ఆదరణ దక్కలేదు. రోజంతా ఎండ తీవ్రతకు బయపడి తక్కువ మందే వచ్చారు. అయితే ప్రేక్షకులను రప్పిచాలంటే సాయంత్రం వేళ జరిగే డే/నైట్‌ టెస్టులు మంచిదని భావిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్‌ తరహాలో సరదాగా సాయంత్రం ఆట చూసేందుకు జనాలు వస్తారని భారత బోర్డు అనుకుంటోంది.

ఫలితాలివే...

ఇప్పటి వరకు పురుషుల క్రికెట్‌లో 11 డే/నైట్‌ టెస్టులు జరిగాయి. భారత్, బంగ్లాదేశ్‌ మినహా అన్ని టాప్​-10 జట్లు గులాబీ బంతితో ఆడాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. అన్నింటిలోనూ విజయం సాధించింది. శ్రీలంక రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్థాన్​, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి.

బంగ్లాదేశ్​, భారత్​ మధ్య మూడు టీ20ల సిరీస్​ నవంబర్​ 3 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్​ 14 నుంచి ఇండోర్​ వేదికగా ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తొలి మ్యాచ్​ ఆడనుంది బంగ్లా. రెండో మ్యాచ్​ నవంబర్​ 22న ఈడెన్​ గార్డెన్స్​లో జరగనుంది. రెండు బోర్డులు ఒప్పుకుంటే ఈ మ్యాచ్​ డే/నైట్​లో ఆడనున్నాయి ఇరుజట్లు.

Last Updated : Oct 27, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details