తెలంగాణ

telangana

ETV Bharat / sports

షకిబ్​పై నిషేధం... కుమిలిపోతున్న బంగ్లా ఆటగాళ్లు - bangladesh,india,shakib al hasan,mashrafe bin mortaza,mohammad mushfiqur rahim,mustafizur rahman,india vs bangladesh 2019/20,international cricket council

బంగ్లాదేశ్‌ టెస్టు, టీ20 సారథి షకిబుల్​ హసన్‌పై... ఐసీసీ నిషేధం వేయడంపై ఆ దేశ క్రీడా విభాగం, అభిమానులు షాక్​కు గురయ్యారు. తోటి క్రీడాకారులు అతడి​తో తమకున్న అనుబంధాన్ని నెట్టింట పంచుకుని బాధను వ్యక్తం చేశారు.

షకిబ్​పై నిషేధం... కుమిలిపోతున్న బంగ్లా ఆటగాళ్లు

By

Published : Oct 30, 2019, 5:01 PM IST

Updated : Oct 30, 2019, 5:15 PM IST

అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ ఆడకుండా బంగ్లాదేశ్ సీనియర్​ క్రికెటర్​ షకిబుల్​ హసన్​పై రెండేళ్ల నిషేధం పడింది. అవినీతి నిరోధ విభాగం నమోదు చేసిన అభియోగాలను షకిబ్‌ అంగీకరించాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. అతడిపై ఒక ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సస్పెన్షన్‌ ఉంటుందని చెప్పింది. ఈ వార్త తెలియగానే బంగ్లా క్రీడా విభాగం, అభిమానులు షాక్​కు గురయ్యారు. ఈ విషయంపై ఆ దేశ ఆటగాళ్లు ఈ స్టార్​ ఆల్​రౌండర్​కు మద్దతుగా నిలుస్తున్నారు.

నువ్వు లేకుండా ఆడేదెలా మిత్రమా...

వన్డే కెప్టెన్​ మష్రఫె మొర్తజా, కీపర్​ ముష్ఫికర్​ రహీమ్​, ముస్తాఫిజుర్​ రెహ్మాన్​.... షకిబ్​తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

"ఒకే వయసు ఉన్న మనిద్దరం అంతర్జాతీయ క్రికెట్​లో 18 ఏళ్లు కలిసి ఆడాం. నువ్వు(షకీబ్​)లేకుండా మైదానంలో ఆడాలంటే చాలా బాధగా ఉంది. కచ్చితంగా పుంజుకుని తిరిగొస్తావు. నువ్వొక ఛాంపియన్​వి. నేను, బంగ్లాదేశ్​ ఎప్పటికీ నీకు మద్దతుగా ఉంటాం. ధైర్యంగా ఉండు.. అంతా మంచే జరుగుతుంది"
-- ముష్ఫికర్​ రహీమ్​, బంగ్లా క్రికెటర్​

ఈ స్టార్​ ప్లేయర్​కు తన మద్దతు ప్రకటించాడు ప్రపంచకప్​ బంగ్లా జట్టు సారథి మొర్తజా. 2023 ప్రపంచకప్ ఫైనల్​ షకిబ్​ సారథ్యంలో ఆడతామని అభిప్రాయపడ్డాడు. ఈ తాజా పరిణామాలు వల్ల కొన్ని రోజులు తనకు నిద్రపట్టదని అన్నాడు.మరో క్రికెటర్​ రెహ్మన్​.. షకిబ్​పై వేటుపడటం ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పాడు.

మోర్తజా ట్వీట్​

"ఇలాంటి పరిస్థితిలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు లేకుండా బరిలోకి దిగాలనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. నీ గురించి నేను నమ్మేది ఒకటే. నువ్వు కచ్చితంగా రెట్టింపు ఆటతో మళ్లీ వస్తావు. ఆ రోజు కోసం మేమంతా వేచి చూస్తుంటాం. భాయ్​ నీకెప్పుడూ మా మద్దతు ఉంటుంది"
--ముస్తాఫిజుర్​ రెహ్మన్​, బంగ్లా క్రికెటర్​

ఏమైంది..?

2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకిబ్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. 2018 ఐపీఎల్‌లో ఏప్రిల్‌ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా బుకీలు సంప్రదించడాన్నీ వెల్లడించని కారణంగా మరో అభియోగం నమోదైంది. వీటిపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జరిపిన విచారణలో షకిబ్‌ తన తప్పులను అంగీకరించాడు.

ఫలితమిదే..!

రెండేళ్ల నిషేధం నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు షకిబ్​ దూరమవుతాడు. 2020 అక్టోబర్‌ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు మాత్రం ఐసీసీ అనుమతి ఇచ్చింది.

తన తప్పును అంగీకరించిన షకిబ్‌.. యువ ఆటగాళ్లకు అవగాహన కల్పించే అంశంలో భాగమవుతానని చెప్పినట్లు ఐసీసీ జీఎమ్ అలెక్స్‌ మార్షల్‌ వెల్లడించారు. స్టార్​ క్రికెటర్​ ప్రతిపాదననూ అంగీకరించామని చెప్పారు.

షకిబ్‌పై నిషేధంతో టీమిండియాతో సిరీస్​లకు బంగ్లాదేశ్‌ కొత్త జట్లను ప్రకటించింది. టెస్టు సారథిగా మొమినుల్ హక్, టీ20 సారథిగా మహ్మదుల్లాను బీసీబీ ఎంపిక చేసింది. నవంబర్‌ 3 నుంచి పర్యటన ఆరంభమవుతుంది.

Last Updated : Oct 30, 2019, 5:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details