తెలంగాణ

telangana

ETV Bharat / sports

అక్షర్ కళ్లద్దాలతో ఆనంద్ మహీంద్ర.. చెప్పింది చేశాడుగా!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. టీమ్ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్​ ధరించే కళ్లద్దాలలాంటివి పెట్టుకుని ఫొటో పంచుకుంటానని చెప్పిన ఆయన.. తాజాగా ఆ మాట నిజం చేశారు.

By

Published : Mar 22, 2021, 10:14 AM IST

Anand Mahindra
ఆనంద్ మహీంద్ర

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంటే అక్షర్‌ పటేల్‌ ధరించే కళ్లద్దాలలాంటివి పెట్టుకుని ఫొటో పంచుకుంటానని చెప్పిన మాటను నిజం చేశారు.

అసలేం జరిగిందంటే..

ఆనంద్‌ మహీంద్ర సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే, భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించాక మహీంద్ర ఓ ట్వీట్‌ చేశారు. ఆ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ పెట్టుకున్న కళ్లద్దాలు బాగున్నాయని, ఆ విజయాన్ని ఆస్వాదించడానికి తనకు ఆ కళ్లద్దాలు కావాలని చెప్పారు. అవి ఏ బ్రాండ్‌, ఎక్కడ దొరుకుతాయని కూడా నెటిజెన్లను అడిగారు.

ఈ క్రమంలోనే మళ్లీ భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో టీ20 సందర్భంగా ఇంకో ట్వీట్‌ చేశారు. 'అక్షర్‌ షేడ్స్‌' లాంటి కళ్లద్దాలు తెచ్చుకుంటానని చెప్పిన తాను వాటిని సంపాదించినట్లు పేర్కొన్నారు. కాగా, అప్పుడే ఓ అభిమాని మహీంద్రను ఒక ఫొటో పంచుకోమని కోరగా.. టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ కూడా గెలిస్తే తప్పకుండా పెట్టుకుంటానని బదులిచ్చారు. ఇక తాజాగా టీమ్‌ఇండియా ఐదో టీ20లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడం వల్ల మహీంద్ర మాట నిలబెట్టుకున్నారు.

"ఇప్పుడు నా మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఇదిగో నేను చెప్పినట్లే 'అక్షర్‌ షేడ్స్‌'తో సెల్ఫీ తీసుకొని మీతో పంచుకుంటున్నా. ఇవి పెట్టుకోవడం శుభసూచికం అని నిరూపితమైంది" అని కళ్లద్దాలతో విక్టరీ సింబల్‌ చూపిస్తున్న ఫొటోను పంచుకున్నారు మహీంద్ర.

కాగా, టీమ్‌ఇండియా ఇప్పటికే ఇంగ్లాండ్‌ను రెండు సిరీస్‌ల్లో ఓడించగా, రేపటి నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లోనూ చిత్తు చేయాలని చూస్తోంది.

ABOUT THE AUTHOR

...view details