తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2020, 7:01 AM IST

ETV Bharat / sports

ఐసీసీ నయా రూల్​: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?

టెస్టు మ్యాచ్​ నిడివిని ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని భావిస్తోంది అంతర్జాతీయ క్రికెట్​ మండలి​(ఐసీసీ). 2023-31 మధ్య భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో భాగంగా ఈ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. వినూత్న ఆలోచనను పలువురు దిగ్గజ క్రికెటర్లు వ్యతిరేకించగా... మరికొందరు సమర్ధిస్తున్నారు. మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్, భారత సారథి విరాట్‌ కోహ్లీ ఈ విషయంపై మాట్లడటం వల్ల మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టెస్టుల్లో మార్పులు, వాటి ఫలితాలపై ఓ విశ్లేషణాత్మక కథనం​.

All Details about '4-Day Test' and Why Sachin and Kohli like Top Playersfour-day Tests Opposing This..?
నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?

క్రికెట్​.. దాదాపు 15వ శాతాబ్దంలోనే ఆరంభమైన ఈ ఆట... చాలా మార్పుల తర్వాత 1877లో ప్రస్తుత టెస్టు మ్యాచ్​ రూపం సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ క్రీడ.. ఆ తర్వాత ఎన్నో రకాలుగా మారింది. సంప్రదాయ టెస్టు ఫార్మాట్​ నుంచి వన్డేలు.. వాటి నుంచి టీ20, టీ10, పింక్​బాల్​ టెస్టు, 100 బంతుల క్రికెట్​ అంటూ పలు మార్పులు జరిగాయి. తాజాగా ఐదు రోజులు జరిగే టెస్టు​ను 4 రోజులకే కుదించాలని ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ).

2023 నుంచే ప్రారంభమా...!

టెస్టు మ్యాచ్​లు ప్రస్తుతం ఐదు రోజుల పాటు జరుగుతుండగా... 2023-2031 షెడ్యూల్​ మధ్య జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​లో ఈ నిడివిని నాలుగు రోజులకు తగ్గించాలని భావిస్తోంది ఐసీసీ. క్రికెట్​కు మరింత ఆదరణ పెంచడమే కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌ల సంఖ్యను పెంచడం, లీగ్‌లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో బీసీసీఐ అధికారుల ప్రతిపాదనల ఆధారంగానే దీనిని రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ ఫార్మాట్​లోని కొన్ని విశేషాలు చూద్దాం.

మార్పులేంటి...?

అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. 2017లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య ఈ తరహా మ్యాచ్​ జరిగింది. 2019లో ఐర్లాండ్​-ఇంగ్లాండ్​ మధ్య మరో మ్యచ్​ నిర్వహించారు.

>> ఐదు రోజుల ఫార్మాట్​లో రోజుకు 90 ఓవర్లు వేస్తే.. నాలుగు రోజులకు మ్యాచ్​ కుదించడం వల్ల రోజూ 98 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రతిరోజు ఆరున్నర గంటలు మ్యాచ్​ జరగనుంది. ఇది ప్రస్తుతం కంటే అరగంట ఎక్కువ సమయం. ఇది ఆఖర్లో ఓవర్లు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.

>> తొలి రెండు సెషన్​లు ఒక్కోటి 2 గంటల 15 నిముషాలు జరగనున్నాయి. గతంలో రెండు గంటలకు ఒక సెషన్​ ఉండేది. సెషన్​ తర్వాత 20 నిముషాలు టీ బ్రేక్​ ఇవ్వనున్నారు. గతంలో తొలి సెషన్​ తర్వాత లంచ్​ బ్రేక్​ ఇచ్చేవారు. ఇప్పుడు రెండో సెషన్​ తర్వాత 40 నిముషాలు డిన్నర్​ బ్రేక్​ ఇవ్వనున్నారు.

>> ఒకవేళ ఓవర్లు వేయడం ఆలస్యమైతే ఆ సమయాన్ని ఎలా కుదిస్తారన్నది నూతన విధానంలో ప్రస్తావించలేదు.

>> ఇప్పటివరకు ప్రత్యర్థి ఇచ్చిన లక్ష్యంలో 200 పరుగులకు తక్కువ చేస్తే ఫాలోఆన్​లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఆ మార్కును 150 పరుగులకు తగ్గించారు.

>>మ్యాచ్​.. మధ్యాహ్నం 1.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదలవుతుంది. 7.30 గంటలకు సూర్యస్తమయం అవుతుందని భావిస్తోంది ఐసీసీ. 7 నుంచి 7:30 మధ్య సమయాన్ని ఆఖర్లో ఓవర్లు పూర్తి చేయడానికి ఇస్తారు.

2019లో ఫలితాలు ఇలా...

గత రెండేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే... 40 శాతం మ్యాచ్​లు మాత్రమే ఐదో రోజు వరకు జరిగాయి. అంటే 60 శాతం మ్యాచ్​లు 4 రోజుల్లోనే ముగిశాయి. 2019లో 39 టెస్టులు జరిగితే ఒక్క మ్యాచ్​లో మాత్రమే 400 ఓవర్లు బౌలింగ్​ వేశారు బౌలర్లు. అంతేకాకుండా 13 మ్యాచ్​లు ఐదో రోజున పూర్తవగా...4 మ్యాచ్​లు డ్రా గా ముగిసాయి. మిగతా 22 మ్యాచ్​లు ఫలితాలు నాలుగు రోజుల్లోనే తేలిపోయాయి.

ఐసీసీ నయా రూల్​: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?
ఐసీసీ నయా రూల్​: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?

ఉపయోగాలేంటి..

టెస్టుల నిడివి నాలుగు రోజులే నిర్వహిస్తే... 2015-23 మధ్య కాలంలో బోర్డులు, ఆటగాళ్లే కాకుండా అంతర్జాతీయ బోర్డుకూ లాభమేనని అంటోంది ఐసీసీ. 2023-2031 కాలంలో నాలుగు రోజుల టెస్టులను అమలు చేస్తే... దాదాపు 335 రోజులు ఖాళీ సమయం ఆటగాళ్లకు లభిస్తుందట. ఈ సమయాన్ని ఉపయోగించుకొని బోర్డులు టెస్టు సిరీస్​లు, టోర్నీలను నిర్వహించుకోవచ్చు. ఇది ఆర్థికంగా మంచి ఫలితాన్నిస్తుందని ఐసీసీ భావిస్తోంది.

ఐసీసీ నయా రూల్​: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?

తేడాలుంటాయా..?

నాలుగు రోజుల్లేనే మ్యాచ్​ ముగియాలంటే అందుకు తగినట్లే పిచ్​ను క్యూరేటర్లు తయారు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మ్యాచ్​లు ఆసక్తికరంగా మారడమే కాకుండా తక్కువగా డ్రా అవుతాయి. టెస్టులు మరింత వేగంగా జరుగుతాయి.

నాలుగు రోజుల ఆట వల్ల ఆటగాళ్లకు ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది. గాయలపాలవడం తగ్గుతుంది. ఓ జట్టు ఏడాదికి 15 టెస్టులు ఆడితే, అది 75 మ్యాచ్​ల కింద లెక్క. అదే 4 రోజుల టెస్టు అయితే 15 రోజులు మిగులుతాయి.

ఐసీసీ నయా రూల్​: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?

దిగ్గజాలు.. మిశ్రమ స్పందనలు

నాలుగు రోజుల టెస్టు ఆలోచనను ఇప్పటికే పలువురు ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు వ్యతిరేకించారు. కొందరు మాత్రం మద్దతిస్తున్నారు. తాజాగా ప్రపంచ దిగ్గజ క్రికెటర్​, మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ ఈ అంశంపై స్పందించాడు. టెస్టుల నిడివిని అయిదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. కొత్త తరాన్ని ఆకర్షించేందుకు, ప్రతి విషయాన్ని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ,మైకేల్​ వాన్​, మెక్​గ్రాత్, గంగూలీ

క్రికెట్‌లో వన్డేలు, టీ20లు, టీ10లు, 100 బాల్స్‌ ఫార్మాట్‌లు ఉన్నాయని... కానీ ఆటలో సుదీర్ఘ ఫార్మాట్ స్వచ్ఛమైన రూపమని అన్నాడు మాస్టర్​. సంప్రదాయమైన ఈ ఫార్మాట్‌ నిడివిని తగ్గించకూడదని పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లీ కూడా​ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అంతేకాకుండా చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు నాథన్​ లయన్​, టిమ్​ పైన్​, గ్లెన్​ మెక్​గ్రాత్​, ట్రావిస్​ హెడ్​ సహా కివీస్​ ఫాస్ట్​ బౌలర్​ నీల్​ వాగ్నర్, ఇంగ్లాండ్​ మాజీ మైకేల్​ వాన్​ కూడా​ వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టులపై ఇప్పుడే స్పందించడం మరీ తొందరపాటవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ పరోక్షంగా వ్యతిరేకించినట్లు మాట్లాడాడు.

మద్దతుదారులు..

టెస్టు క్రికెట్​కు మరింత ఆదరణ పెంచేందుకు ఈ మార్పు స్వాగతించదగ్గదే అని క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ బోర్డులు ఈ నిర్ణయంపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అమలు..?

2019లో అన్ని టెస్టులు 5 రోజుల కంటే ముందే ముగిశాయి. ఎక్కువ శాతం బలమైన జట్లు తమకంటే తక్కువ స్థాయి జట్లతోనే మ్యాచ్​లు ఆడాయి. అదే రెండు జట్లు బలమైనవైతే ఫలితం ఐదు రోజుల వరకు సాగుతుంది.

ఉదాహరణకు యాషెస్​ సిరీస్​లో 4 రోజుల టెస్టు మ్యాచ్​ ఉంటే... ఇంగ్లాండ్​ జట్టు టెస్టు సిరీస్​ను 1-0తేడాతో నెగ్గేది. కానీ ఐదు మ్యాచ్​ల్లో 3 మ్యాచ్​లు ఐదో రోజు వరకు కొనసాగాయి. ఫలితంగా 2-2 తేడాతో సిరీస్​ సమమైంది. ఇప్పటికే పలు బోర్డులు దీనిపై సుముఖంగా ఉండగా... బీసీసీఐ మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోనుంది. ఏది ఏమైనా ఎన్నో ఏళ్ల చరిత్ర మార్చేందుకు ఐసీసీ తలపెట్టిన నిర్ణయం అమలవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details