భారత క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ అంటే తెలియని వారుండరు. ఇద్దరూ భిన్న ధ్రువాలు అనడంలో సందేహం లేదు. ఒకరు దూకుడుకు మారుపేరు అయితే, మరొకరు ప్రశాంతతకు ప్రతీక. ఒకరు బౌలర్లను ఉతికారేయడమే పనిగా పెట్టుకుంటే.. మరొకరు వారి సహనానికే పరీక్ష పెడతారు. ఒకరు బౌండరీల వర్షం కురిపిస్తే.. మరొకరు డిఫెన్స్కు ప్రాధాన్యమిస్తారు. ఎలా ఆడినా ఇద్దరిదీ ఒకే మంత్రం. అదే ప్రత్యర్థులకు గుబులు పుట్టించడం. ఇలాంటి భిన్నమైన బ్యాటింగ్ స్వభావం కలిగిన ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగి.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్కు చెమటలు పట్టిస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఓపెనింగ్ జోడీగా వెళ్లి ప్రపంచ రికార్డు దిశగా దూసుకెళితే.. ఆ అనుభూతే వేరు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇదే జరిగింది. కాకపోతే 6 పరుగుల తేడాతో తృటిలో గొప్ప రికార్డు చేజారిపోయింది. ఆ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి..
2006 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా లాహోర్ వేదికగా జనవరి 13 నుంచి 17 వరకు తొలి టెస్టు జరిగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ రెండు రోజులకు పైగా బ్యాటింగ్ చేసి 679/7 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై టీమ్ఇండియా బరిలోకి దిగి ఐదోరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టపోయి 410 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఓపెనర్లుగా వచ్చిన సెహ్వాగ్(254; 247 బంతుల్లో 47x4 1x6), ద్రవిడ్(128; 233 బంతుల్లో 19x4) పాక్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఒకరు వన్డే మ్యాచ్ను తలపిస్తే మరొకరు అసలు సిసలైన టెస్టు మ్యాచ్ను చూపించారు. ఈ క్రమంలోనే ఆట చివరి వరకు క్రీజులో పాతుకుపోయి తొలి వికెట్కు 410 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంకో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకునేలోపే వీరూ ఔటయ్యాడు. కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ క్రీజులోకి వచ్చినా ఒకే బంతి ఆడాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా ఐదో రోజు ఆటను 410/1 స్కోర్తో ముగించింది.