తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ రికార్డుకు పదేళ్లు.. గేల్ ఘనతకు ఐదేళ్లు

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధ్యమా. ఒకవేళ సాధ్యమైతే ఏ క్రికెటర్ ఆ ఘనతను సాధించగలడు. 2010, ఫిబ్రవరి 24కు ముందు అభిమానులకు ఎదురైన ప్రశ్నలివి. వీటన్నింటికీ చెక్ పెడుతూ క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ వన్డేల్లో ద్విశతకం బాదాడు. ఈ రికార్డుకు నేటికి సరిగ్గా పదేళ్లు.

By

Published : Feb 24, 2020, 10:25 AM IST

Updated : Mar 2, 2020, 9:19 AM IST

సచిన్
సచిన్

అభిమానులకు అతడు ఆరాధ్య దైవం. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్​లో ఎన్నో వేల పరుగులు. లెక్కకట్టలేని రికార్డులు. క్రికెట్‌ చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలు. అతడి ఆట కోసమే మైదానానికి వచ్చేవాళ్లు, టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోకొల్లలు. అతడి విధ్వంస ఇన్నింగ్స్‌లు ప్రత్యర్థులకు పీడ కలలు. ఏ ఆటగాడు సాధించలేని శతక శతకాలు అతడి సొంతం. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇదంతా క్రికెట్‌ దిగ్గజం సచిన్ రమేశ్‌ తెందూల్కర్‌ గురించే అని. సచిన్‌ సాధించిన రికార్డులు చెప్పుకుంటూ పోతే ఓ రోజు సరిపోదంటే అతియోశక్తి కాదు. 2010లో దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ద్విశతకం క్రికెట్‌ ప్రపంచాన్నే ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్‌ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. అది సరిగ్గా ఈరోజే.

2010, ఫిబ్రవరి 24.. ఈ తేదీకి భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్​.. వన్డేల్లో డబుల్ సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రోజది.

ఈ మ్యాచ్‌లో 147 బంతులు ఎదుర్కొన్న మాస్టర్ 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సచిన్​ ఖాతాలో డబుల్ సెంచరీ పడాలని కోరుకున్న అభిమానులు ఉప్పొంగిపోయారు.

గేల్ ద్విశతకమూ ఈరోజే

2015 వన్డే ప్రపంచకప్​లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్​మెన్ క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేశాడు. మెగాటోర్నీలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో ఇది తొలి డబుల్ సెంచరీ. 138 బంతుల్లో గేల్ డబుల్ సెంచరీ బాదాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. జింబాబ్వే బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. ఫలితంగా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 138 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో గేల్ ఈ అరుదైన ఘనత సాధించాడు.

మొత్తంగా ఇప్పటివరకు వన్డేల్లో సచిన్‌ తర్వాత ఏడు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో నాలుగు భారత ఆటగాళ్లవే. 2010లో సచిన్ ద్విశతకం చేయగా, 2011లో వెస్టిండీస్‌పై సెహ్వాగ్‌ 219 పరుగులు చేశాడు. అతడి తర్వాత హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ బాదాడు. ఆసీస్‌పై ఒక సారి, శ్రీలంకపై రెండు సార్లు ద్విశతకం చేశాడు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌ గేల్‌, కివీస్‌ ఆటగాడు మార్టిన్ గప్తిల్, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌ కూడా ద్విశతకాన్ని అందుకున్నారు.

Last Updated : Mar 2, 2020, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details