తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2020, 11:30 AM IST

Updated : Dec 31, 2020, 2:56 PM IST

ETV Bharat / sports

ఏనాడైనా ఊహించామా.. వారి కోసం ఏడుస్తామని!

ఎప్పుడైనా కలగన్నామా..! మహిళల క్రికెట్‌ మ్యాచ్‌కు లక్షమంది హాజరవుతారని. ఎప్పుడైనా ఊహించామా..! మహిళల క్రికెట్‌ను కోట్లాది మంది అనుసరిస్తారని. ఎప్పుడైనా అనుకున్నామా..! మహిళల క్రికెట్‌ ఫైనల్‌ కోసం పురుషులు టీవీలకు అతుక్కుపోతారని. అమ్మాయిలు ఓటమిపాలైతే భావోద్వేగంతో అభిమానులూ కన్నీరు కారుస్తారని. ఇవన్నీ నిజం చేసింది 2020. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం.

team india
టీమ్​ఇండియా

మహిళల క్రికెట్‌ అంటేనే ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. ఆ మ్యాచ్​లు జరుగుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ఒక విదేశీ జట్టు వచ్చిందంటే స్పాన్సర్ కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి.‌ అప్పుడప్పుడు అంజుమ్‌ చోప్రా పేరు వినపడేది. ఆ తర్వాత మిథాలీరాజ్‌ కనపడటం మొదలైంది. ఎప్పుడైతే మహిళల క్రికెట్‌ బీసీసీఐలో విలీనమైందో వారి దశ తిరిగింది. కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోయాయి. విదేశీ పర్యటనలు పెరిగాయి. పత్రికలు, మీడియాలో వార్తలు వచ్చాయి. ఆపై ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. ఇప్పుడు వేద కృష్ణమూర్తి, జూలన్‌ గోస్వామి, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, పూనమ్‌ యాదవ్‌, షెఫాలీ వర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌, అరుంధతీ రెడ్డి వంటి క్రికెటర్లు అందరికీ పరిచయం అయ్యారు. ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​లో వారి ప్రదర్శనతో క్రికెట్​ అభిమానులను మెప్పించడమే కాకుండా.. జట్టును ఫైనల్​కు చేర్చడానికి కృషి చేశారు. 2020, మార్చి 8న తుదిపోరులో ఓడిన భారత మహిళల జట్టు కోసం అభిమానులు భావోద్వేగానికి గురయ్యి.. కన్నీరు కార్చారు. ఎన్నెన్నో అనుభూతులను పంచిన ఆ ప్రపంచకప్‌ గురించి మరొక్కసారి నెమరేసుకుందాం.

అభివాదం చేసుకుంటున్న భారత మహిళా జట్టు

ఫైనల్‌ వరకు జైత్రయాత్ర

ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ టీ20 ప్రపంచకప్‌ జరిగింది. పది జట్లు రెండు బృందాలుగా తలపడ్డాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి కఠిన ప్రత్యర్థులున్న గ్రూప్‌-ఏలో భారత జట్టుకు చోటు లభించింది. దాంతో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరడం కష్టమే అనుకున్నారు. అలాంటిది మిగిలిన నాలుగు జట్లను చిత్తుచేసి 8 పాయింట్లు, +0.979 రన్‌రేట్‌తో సంచలనం సృష్టించింది హర్మన్‌ సేన. తొలి మ్యాచ్​లోనే ఆతిథ్య ఆస్ట్రేలియాకు మర్చిపోలేని షాకిచ్చింది. 132 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని 17 పరుగుల తేడాతో విజయబావుటా ఎగరేసింది.

రెండో మ్యాచ్​లో బంగ్లాను 18 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మూడో మ్యాచ్​లో న్యూజిలాండ్‌కు 3 పరుగుల తేడాతో ఓటమి రుచి చూపించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆఖరి లీగ్​ మ్యాచులో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దు కావడం వల్ల నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.

ఫైనల్‌ వరకు జైత్రయాత్ర

ఫైనల్లో కన్నీరు

అనుకున్న రోజు రానేవచ్చింది. ఒకవైపు ఓటమెరుగని భారత్‌. మరోవైపు హర్మన్​సేన చేతిలో తొలి మ్యాచ్​లో దెబ్బతిన్న ఆస్ట్రేలియా. ఫైనల్లో ఫేవరెట్‌ ఎవరో చెప్పలేని పరిస్థితి. ఆసీస్‌ వైపు అనుభవం ఉంటే టీమ్‌ఇండియా వైపు ఆశలున్నాయి. ఇక చారిత్రక మెల్‌బోర్న్ దాదాపుగా‌ లక్షమందితో నిండిపోయింది. భారతీయ అభిమానులంతా టీవీ తెరలకు అతుక్కుపోయారు. సచిన్‌, గంగూలీ, గావస్కర్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ వంటి మాజీ క్రికెటర్లు భారత జట్టు గెలవాలని శుభాకాంక్షలు తెలిపారు. టాస్‌ అదృష్టం ఆతిథ్య జట్టునే వరించింది. అయితే ఆ జట్టు ఓపెనర్లు అలీసా హేలీ (75; 39 బంతుల్లో 7×4, 5×6), బెత్‌మూనీ (78*; 54 బంతుల్లో 10×4) చుక్కలు చూపించారు. మొదటి మ్యాచ్​లో భయపడ్డ పూనమ్‌ బౌలింగ్‌ను అత్యంత తెలివిగా ఎదుర్కొన్నారు. స్వీప్‌ షాట్లతో రాణించి తొలి వికెట్‌కు 115 పరుగులు చేశారు. ఫలితంగా టీమ్‌ఇండియాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్​ నిర్దేశించింది.

ఛేదనలో షెఫాలీ (2), స్మృతి (11) పేలవ ఆరంభాన్ని ఇచ్చారు. దీప్తి శర్మ (33) మినహా మరెవ్వరూ పరుగులు చేయకపోవడం వల్ల భారత్‌ 99కే ఆలౌటై 85 పరుగులతో చిత్తై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పెద్ద మ్యాచ్​లు ఆడకపోవడం, అనుభవలోపం, సీనియర్ల నిలకడ లేమి, ఒత్తిడికి చిత్తవ్వడం టీమ్‌ఇండియా ఓటమికి కారణాలయ్యాయి.

ఫైనల్లో కన్నీరు

అదరగొట్టిన షెఫాలీ

సీనియర్లు, స్టార్లు విఫలమైన ఈ ప్రపంచకప్‌లో కొందరు అమ్మాయిలు అదరగొట్టారు. ఓపెనర్‌ షెఫాలీ వర్మ 5 మ్యాచుల్లో 32.60 సగటు, 158.25 స్ట్రైక్‌రేట్‌తో 163 పరుగులు చేసి.. టాప్‌-5లో నిలిచింది. 18 బౌండరీలు, 9 సిక్సర్లూ బాదింది. అత్యధిక సిక్సర్లు బాదిన అమ్మాయిగా హేలీతో సమానంగా నిలిచింది. టోర్నీలో అత్యధిక స్ట్రైక్‌ ఆమెదే కావడం విశేషం. బౌలర్‌ మీదుగా ఆమె కొట్టిన సిక్సర్లకు విశ్లేషకులు ఫిదా అయ్యారు. మరో విషయం ఏంటంటే అప్పటికి ఆమె ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌ఉమన్‌. ఇక ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ చేసిన 116 పరుగులు ఎంతో విలువైనవి. టాప్‌ ఆర్డర్‌ వికెట్లు కోల్పోయిన ప్రతిసారీ నేనున్నా అంటూ సమయోచిత భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఇక స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 5 మ్యాచుల్లో 11.90 సగటుతో ఆమె 10 వికెట్లు తీసి టాప్‌-2లో నిలిచింది. ఆసీస్‌తో తొలి మ్యాచ్​లో నాలుగు వికెట్ల ఘనతనూ అందుకుంది. తనదైన ఫ్లయిటెడ్‌ డెలివరీలు, వేగంలో మార్పు చేస్తూ ఆమె టోర్నీ సాంతం రాణించింది. 7 వికెట్లతో పేసర్‌ శిఖాపాండే ఫర్వాలేదనిపించింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌, వేద కృష్ణమూర్తి రాణించకపోవడం ఫైనల్లో జట్టు కొంప ముంచింది.

అదరగొట్టిన షెఫాలీ

ఉమెన్‌ ఐపీఎల్‌ కావాలి

ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచకప్‌ అభిమానులు, క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే సీనియర్లెవరూ రాణించకపోయినా, తక్కువ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడారు. కొత్తగా వచ్చిన అమ్మాయిలు సత్తా చాటడం ఆనందం కలిగించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో స్వల్ప తేడాతో ఫైనల్‌ ఓడిపోవడం.. ఇక్కడ టీ20 ఫైనల్లో ఓటమి బాట పట్టడం వల్ల వారిపై సానుభూతి, ప్రేమ కలిగింది. వారికి మరింత ప్రోత్సాహం అవసరం అనిపించింది. ఆసీస్‌, కివీస్‌, విండీస్‌ బౌలర్లను ఎదుర్కోవాలంటే టీమ్‌ఇండియా అమ్మాయిలకు ఫిట్‌నెస్‌, భుజబలం అవసరం. స్మృతి, హర్మన్‌, షెఫాలీ భారీ సిక్సర్లు కొట్టగలిగినా దీప్తిశర్మ లాంటి ఆల్‌రౌండర్‌కు ఇది మరింత అవసరం. పురుషులకు మాదిరిగానే వీరికి ఎక్కువ ద్వైపాక్షిక సిరీసులు ఏర్పాటు చేయాలి. పెద్ద మ్యాచ్​ల్లో ఒత్తిడికి చిత్తవ్వకుండా ఉండాలంటే ఐపీఎల్‌ తరహా వేదిక కావాలి. ఆసీస్‌, ఇంగ్లాండ్‌ వంటి జట్లు ప్రపంచకప్‌లు గెలుస్తున్నాయంటే మహిళల బిగ్‌బాష్‌ లీగులో పాల్గొనడమే కారణం. ఈ ఏడాది కరోనా ఉన్నా టీ20 ఛాలెంజర్స్‌ నిర్వహించిన బీసీసీఐ వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక ఐపీఎల్‌ నిర్వహిస్తుందని ఆశిద్దాం.

ఉమెన్‌ ఐపీఎల్‌ కావాలి

ఇదీ చూద్దాం : 2020 రౌండప్: లోకాన్ని విడిచి.. మదిలో నిలిచి!

Last Updated : Dec 31, 2020, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details