కరోనా దెబ్బకు '2020' చేదు జ్ఞాపకమే! మహమ్మారి విజృంభణకు ఇక సాధారణ జీవితం గడపలేమనే భావన అందరిలోనూ వచ్చింది. ఉల్లాసం, వినోదం కరవయ్యాయి. కానీ కాలం గడిచేకొద్ది పరిస్థితులు చక్కబడుతున్నాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి అడుగులు పడుతున్నాయి. అయితే కొవిడ్-19 వార్తలతో విసిగిపోతున్న ప్రజలకు 'క్రికెట్' ఎంతో ఊరటనిచ్చింది. వైరస్ ఆలోచనల నుంచి బయటకు తీసుకువచ్చింది. ప్రమాదకర స్థితిలోనూ ఆటగాళ్లు క్రమశిక్షణతో అభిమానుల్ని అలరించారు. ఈ కఠిన ఏడాదిలో క్రికెట్ ప్రయాణం ఎలా సాగిందంటే...
ఏడాది ప్రారంభంలో
ఈ ఏడాది ఆరంభంలో టీమ్ఇండియా సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడింది. తొలి మ్యాచ్ రద్దవ్వగా మూడు మ్యాచుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించింది. మూడు వన్డేల సిరీస్ను కోహ్లీసేన 2-1తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లో పది వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమ్ఇండియా.. తర్వాత బెబ్బులిలా చెలరేగి సిరీస్ను సాధించింది. మరోవైపు ప్రపంచ క్రికెట్లో ఇంగ్లాండ్×దక్షిణాఫ్రికా, వెస్టిండీస్×ఐర్లాండ్, బంగ్లాదేశ్×పాకిస్థాన్ సిరీస్లు సాఫీగా సాగాయి. తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీసేన బయలుదేరింది.
కివీస్పై పాంచ్ పటాకా.. రన్నరప్గా భారత్
కివీస్ పర్యటనలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అయిదు టీ20ల సిరీస్ను కోహ్లీసేన 5-0తో విజయఢంకా మోగించింది. దీనిలో రెండు మ్యాచ్లు 'టై' అవ్వగా.. సూపర్ఓవర్లలో టీమ్ఇండియా చెలరేగిన తీరు అద్భుతం. ఆఖరి బంతికి డీప్ ఎక్స్ట్రాకవర్ మీదగా రోహిత్ శర్మ సిక్సర్ బాది జట్టును గెలిపించడం సిరీస్లోనే హైలైట్. అయితే తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీస్లను టీమ్ఇండియా 0-3, 0-2తో కోల్పోయింది. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగిన మహిళా టీ20 క్రికెట్ ప్రపంచకప్కు ఎంతో ఆదరణ లభించింది. టీమ్ఇండియా ఫైనల్లో తడబడి ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. అయినా మెగాటోర్నీలో హర్మన్ప్రీత్సేన పోరాటం అభినందనీయం.
మహమ్మారి ఎంట్రీ
కివీస్ పర్యటన అనంతరం కోహ్లీసేన స్వదేశానికి తిరిగొచ్చింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు సిద్ధమైంది. కాగా, తొలి మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దైంది. అప్పటికే దేశంలో కరోనా వ్యాప్తి వేగవంతమైంది. దీంతో మిగిలిన మ్యాచ్లు కొవిడ్ భయంతో జరగలేదు. స్టేడియంలో అభిమానులు లేకుండా మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నించినా, మహమ్మారి ఉద్ధృతితో సాధ్యం కాలేదు. ఈ సిరీస్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడాకార్యకలాపాలు స్తంభించాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదాపడింది. మెగా ఈవెంట్ ఒలింపిక్స్ను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
ఇంగ్లాండ్ ఊపిరిపోసింది..
దాదాపు మూడు నెలలు క్రీడలకు సంబంధించిన ఎలాంటి వార్తలు లేవు. ఎక్కడ చూసినా, ఏం విన్నా కరోనానే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బయోబబుల్ విధానం.. క్రికెట్కు తిరిగి ఊపిరిపోసింది. వెస్టిండీస్, ఐర్లాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో బయోబుడగలో ఇంగ్లాండ్ ద్వైపాక్షిక సిరీస్లను విజవంతంగా ముగించింది. అయితే అభిమానులకు అనుమతివ్వలేదు. కాగా, ఇంగ్లాండ్ చూపిన దారిలో మెన్స్ టీ20 ప్రపంచకప్ను ఆస్ట్రేలియా నిర్వహిస్తుందని భావించారంతా. కానీ ఆసీస్ క్రికెట్ బోర్డు టోర్నీని నిర్వహించలేమని తేల్చిచెప్పడం వల్ల అభిమానులు నిరాశే మిగిలింది. అయితేనేం, టోర్నీ వాయిదాతో ఐపీఎల్కు విండో క్లియర్ అయ్యింది. కానీ లీగ్ను ఎక్కడ నిర్వహించాలి? ఎలా ఏర్పాట్లు చేయాలి? అనే ప్రశ్నలు బీసీసీఐకి తలెత్తాయి.