భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. టోక్యో ఒలింపిక్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఒలింపిక్స్కు ముందు బ్యాడ్మింటన్లో షెడ్యూల్కు మించి ఎలాంటి టోర్నీలు ఉండవంటూ.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్కు ముందు ఉన్న చివరి అర్హత టోర్నీ సింగపూర్ ఓపెన్ రద్దు కావడం వల్ల సైనా ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఒలింపిక్స్కు ముందు జరగాల్సిన మూడు పెద్ద టోర్నీలైనా ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్లు రద్దయ్యాయి. పైగా ఆటగాళ్ల ర్యాంకుల్లోనూ ఎటువంటి మార్పులు జరగలేదు. దీంతో సైనా టోక్యో ఆశలు గల్లంతయ్యాయి. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న ఈమె భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ మెదిలే ప్రశ్న.
21వ శతాబ్దం స్టార్ క్రీడాకారిణి
సైనా నెహ్వాల్ తన కెరీర్లో 637 మ్యాచ్లు ఆడి 437 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అంటే ఆమె విజయశాతం 60కి పైగా ఉంది. అలాగే 11 సూపర్ సిరీస్ టైటిళ్లూ గెలిచింది. బ్యాడ్మింటన్లో ఉద్ధండులుగా పిలవబడే చెనా, జపాన్, థాయ్లాండ్కు చెందిన క్రీడాకారులను మట్టికరిపించి భారత పతాకాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత సైనాది. ఆమె రాకతో భారత బ్యాడ్మింటన్ రూపురేఖలే మారిపోయాయి. ఎన్నో విజయాలు, మరెన్నో ఘనతలు, ఒలింపిక్స్, ప్రపంచ సిరీస్ వంటి పోటీల్లో పతకాలతో సైనా కెరీర్ ఎంతో ఘనంగా సాగింది. కానీ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయిందీ క్రీడాకారిణి. ఈ నేపథ్యంలో 21 శతాబ్దంలో స్టార్ షట్లర్గా గుర్తింపుపొందిన సైనా.. తర్వాతి అడుగు ఎటువైపు. అసలు తన కెరీర్ను కొనసాగిస్తుందా? లేక త్వరలోనే ఆటకు గుడ్బై చెబుతుందా? అన్నది అసలు ప్రశ్న.
శిఖారాగ్రాన సైనా
2008 చైనాలో జరిగిన ఒలింపిక్స్కు అర్హత సాధించిన సైనా.. ఈ పోటీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. కాగా, ఈ మెగాటోర్నీకి ముందు జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించి అందరినీ తనవైపు తిప్పుకొంది. ఈ పోటీల్లో ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి సయాక సటోను వరుస సెట్లలో ఓడించింది. ఇక్కడ నుంచి సైనా కెరీర్ స్వర్ణయుగంవైపు సాగింది. 18 ఏళ్ల వయసులోనే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు నెగ్గిన సైనా.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ గొప్ప క్రీడాకారిణిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేసింది. మునుపెన్నడు చూడని విధంగా మహిళల సింగిల్స్లో భారత్ తరఫున అనేక రికార్డులు సాధించింది.
2008 ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి ఏడాది సైనా తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గింది. జకర్తా వేదికగా జరిగిన ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ లిన్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్గా రికార్డు సృష్టించింది.
నాలుగేళ్ల తర్వాత భారత మహిళల బ్యాడ్మింటన్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పింది సైనా. అప్పటికే నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న ఈమె.. ఆల్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో స్థానం సంపాందించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. కానీ డెన్మార్క్కు చెందిన టినె బాన్ చేతిలో ఓడిపోయింది.
2010 సింగపూర్ ఓపెన్లో గెలిచిన సైనా ర్యాంకింగ్స్లో టాప్-3కి చేరుకుంది. తై జూ యంగ్, లు లన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను మట్టికరిపించిన సైనాను చూసి.. ఈమె భారత బ్యాడ్మింటన్ ముఖ చిత్రాన్ని మారుస్తుందని అంతా భావించారు. అలాగే లండన్ ఒలింపిక్స్లో ఆమెకు పతకం పక్కా అన్న నమ్మకాన్ని పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న సైనా.. ఈ మెగాటోర్నీలో కాంస్యం సాధించి.. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
లండన్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తర్వాత మూడేళ్లలో మరో ఏడు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గింది నెహ్వాల్. పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్ వంటి కోచ్ల పర్యవేక్షణలో రాటుదేలింది. చైనా, స్పెయిన్, జపాన్, థాయ్, ఇండోనేసియా ఆటగాళ్ల డిఫెన్స్ను ఛేదిస్తూ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.