తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2019, 6:36 AM IST

Updated : Sep 30, 2019, 4:46 AM IST

ETV Bharat / sports

అందరి కళ్లు నా పైనే ఉన్నాయి: పీవీ సింధు

గత నెలలో వరల్డ్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గిన తర్వాత అందరి కళ్ళు తనపైనే ఉన్నాయని చెప్పింది పీవీ సింధు. కాబట్టి నిలకడగా రాణించాలంటే కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని తెలిపింది.

సింధు

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్​గా రికార్డు సృష్టించిన పీవీ సింధు తర్వాతి టోర్నీలపై దృష్టి పెట్టింది. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన తర్వాత అందరి కళ్లు తనపైనే ఉంటాయని, నిలకడగా రాణించాలంటే వినూత్న వ్యూహాలతో ముందుకు వెళ్లాలని చెబుతోందీ తెలుగు అమ్మాయి.
ప్రపంచ ఛాంపియన్​షిప్​ నెగ్గిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని చెప్పింది సింధు.

"వరల్డ్​ ఛాంపియన్ అయ్యాక అందరి కళ్లు నా పైనే ఉన్నాయి. ఈ విజయంతో నాపై మరింత ఒత్తిడి, బాధ్యత పెరిగాయి. కాబట్టి నేను ఇంకా కష్టపడాల్సి ఉంది. నా ఆటలో కొన్ని మార్పులు చేసి కోర్టులోకి వెళ్లే ప్రతి సారి వినూత్న వ్యూహాలతో బరిలో దిగాలి. ఈ గెలుపు కోసం ఐదేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా. ఓడినప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. అయితే శ్రమించడం మాత్రం ఆపలేదు. నేను ఈ స్థాయిలో ఉండడం కోసం నా తల్లిదండ్రలు ఎన్నో త్యాగాలు చేశారు" -పీవీ సింధు, భారత షట్లర్

ప్రస్తుతం ఈ నెలలో జరుగనున్న చైనా, కొరియా ఓపెన్​లపైనే దృష్టిపెట్టానని చెబుతోంది సింధు.

"ఇప్పుడు చైనా, కొరియా ఓపెన్​ కోసం సన్నాహాకమవుతున్నా. ఈ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒలింపిక్స్ ముందు చాలా టోర్నీలున్నాయి. వాటిలో వంద శాతం ప్రయత్నించి ఒత్తిడిని అధిగమిస్తా" -పీవీ సింధు, భారత షట్లర్

కోచ్ గోపీచంద్ పర్యవేక్షణలో రాటుతేలానని, ఇతర దేశాల నుంచి నైపుణ్యం గల శిక్షకుల సాయం తీసుకుంటున్నామని చెప్పింది సింధు. మన దేశంలోనూ ఆ స్థాయిలో క్వాలిఫైయడ్​ కోచ్​లను ప్రోత్సహించాలని, అప్పుడే ఎక్కువ మంది ఛాంపియన్లు తయారవుతారని తెలిపింది సింధు.

ఈ నెల 17 నుంచి 22 వరకు చైనా ఓపెన్ జరుగనుంది. అనంతరం 24 నుంచి 29 వరకు కొరియా ఓపెన్​లో తలపడనుంది పీవీ సింధు.

ఇదీ చదవండి: 'వారి మధ్య గొడవల్లేవు.. అభిప్రాయభేదాలే'

Last Updated : Sep 30, 2019, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details