రెండేళ్ల క్రితం వరుస పతకాలతో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు దుమ్మురేపారు. హఠాత్తుగా ఏమైందో తెలియదు గానీ గతేడాది మొదటి, రెండో రౌండ్లోనే వెనుదిరిగారు. 2020లోనూ ఎవరికీ శుభారంభం దక్కలేదు. బుధవారం నుంచి ఆరంభమయ్యే థాయ్లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ నుంచి నిలకడగా విజయాలు సాధించకపోతే సీనియర్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్ ఆశలు గల్లంతవ్వడం ఖాయం.
టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఏప్రిల్ 26 ఆఖరి తేదీ. నిబంధనల ప్రకారం టాప్-16లో ఉన్న షట్లర్లు ప్రతి విభాగం నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక అవుతారు. ప్రస్తుతం సైనా 22, శ్రీకాంత్ 23వ స్థానాల్లో ఉన్నారు. నిర్దేశిత గడువులోగా వీరి ర్యాంకులు మెరుగవ్వకపోతే టోక్యో వెళ్లడం కష్టం. ఇప్పటికైతే పీవీ సింధు (6వ ర్యాంకు), సాయి ప్రణీత్ (11వ ర్యాంకు), పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (8వ ర్యాంకు)కు ఢోకా లేనట్టే.