తెలంగాణ

telangana

By

Published : Aug 20, 2020, 6:44 AM IST

ETV Bharat / sports

అసలైన ఆట కోసం వెయిటింగ్​!

దేశంలో లాక్​డౌన్ ఆంక్షలు సడలించడం వల్ల ఇప్పుడిప్పుడే క్రీడాకారులు తమ ప్రాక్టీసును​ మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో గోపీచంద్​ బ్యాడ్మింటన్ అకాడమీలో జాతీయ శిక్షణా శిబిరం జోరుగా సాగుతోంది. ప్రాక్టీసు ప్రారంభించినా టోర్నీలు ఎప్పుడు జరుగుతాయా అంటూ స్టార్​ షట్లర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Badminton players are waiting for the tournaments
అసలైన ఆట కోసం వెయిటింగ్​!

మైదానాల్లో మళ్లీ సందడి మొదలైంది. కరోనా దెబ్బకు దాదాపుగా అయిదు నెలలు ఆగిపోయిన ఆటలు నెమ్మదిగా పట్టాలెక్కుతున్నాయి. ఐపీఎల్‌ ప్రకటనతో క్రికెటర్లు బ్యాట్లు, బంతులు పట్టుకోగా.. ఇప్పుడు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు బిజీగా మారిపోయారు. హైదరాబాద్‌లోని సాయ్‌ గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జాతీయ శిక్షణా శిబిరం జోరుగా సాగుతోంది. స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, సిక్కిరెడ్డి సాధనలో నిమగ్నమయ్యారు. టోర్నీలు కూడా మొదలైతే బ్యాడ్మింటన్‌ పరుగులు తీస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.

పీవీ సింధు

అప్పుడు తీవ్రత పెంచొచ్చు: సింధు

ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు సాధన చేస్తున్నా. తర్వాత సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌, సిక్కి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కోచ్‌లు గోపీచంద్‌, పార్క్‌లు సాధన చేయిస్తున్నారు. కరోనా కారణంగా ఇంట్లో ఉన్నన్ని రోజులూ ఫిట్‌నెస్‌ కసరత్తులు చేశా. ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్నా.. సాధన ఆరంభంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఎప్పట్లాగే ప్రాక్టీస్‌ చేశా. గోపీచంద్‌ అకాడమీలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. గంటన్నర సాధనకు.. రెండున్నర గంటలు ఫిట్‌నెస్‌కు కేటాయిస్తున్నా. టోర్నీలపై స్పష్టత వస్తే ప్రాక్టీస్‌ తీవ్రత పెంచొచ్చు.

సాయి ప్రణీత్​

ఆట అప్పుడే: సాయిప్రణీత్‌

చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్‌ మొదలుపెట్టాం. కనీసం నెలన్నర రోజులు ఏకధాటిగా సాధన చేస్తే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించొచ్చు. కరోనా భయం ఇంకా పూర్తిగా పోలేదు. ప్రాక్టీస్‌ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కోర్టులు, జిమ్‌లు ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి నేను, సింధు, శ్రీకాంత్‌, సిక్కి సాధన చేస్తున్నాం. అంతర్జాతీయ క్యాలెండర్‌ విడుదలైతే అసలు ఆట ప్రారంభమవుతుంది.

సిక్కిరెడ్డి

ఇంకొందరికి అనుమతివ్వాలి: సిక్కిరెడ్డి

మళ్లీ ఆట మొదలుపెట్టినందుకు ఆనందంగా ఉంది. ఐదు నెలల తర్వాత సాధన చేస్తున్నా కాబట్టి దేహంపై ఎక్కువ ఒత్తిడి తేవట్లేదు. నా భాగస్వామి అశ్విని పొన్నప్ప బెంగళూరులో సాధన చేస్తోంది. ప్రస్తుతానికి అకాడమీలో నలుగురం సాధన చేస్తున్నాం. మరికొంత మందికి అవకాశం ఇస్తే బాగుంటుంది. సుమీత్‌, కశ్యప్‌, గురుసాయిదత్‌, రాహుల్‌ వంటి క్రీడాకారులకు అనుమతివ్వాలి.

ABOUT THE AUTHOR

...view details