తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2019, 5:22 PM IST

ETV Bharat / sports

ఆల్ ఇంగ్లండ్​లో నిలిచేనా...

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు గతేడాది అంతగా కలిసిరాలేదు. ఈ ఏడాది మంచి ఫామ్​లో ఉంది. మరోవైపు బుధవారం నుంచి మొదలుకానున్న ఆల్​ ఇంగ్లండ్​ టైటిల్​పై కన్నేసింది సైనా నెహ్వాల్.

సైనా-సింధు

బుధవారం నుంచి ఆల్​ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. 120 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రతిష్టాత్మక టైటిల్​పై భారత షట్లర్లు సింధు, సైనా కన్నేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్​లో తొలి 32 మంది షట్లర్లే అర్హత సాధించే ఈ టోర్నీలో భారత నుంచి సింధు, సైనాతో పాటు కిదాంబి శ్రీకాంత్ ఎంపికయ్యాడు.

తొలి మ్యాచ్​లోదక్షిణకొరియాకు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి జీ హ్యూతో ఆడనుంది సింధు. స్కాట్​లాండ్​కు చెందిన క్రిస్టి గిల్​మౌర్​తో సైనా తలపడనుంది. కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్​కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ విక్టర్​ను ఢీకొట్టనున్నాడు.

గత ఏడాది ఆడిన అన్ని ఈవెంట్లలోనూ రజతాలతో సరిపెట్టుకుంది సింధు. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్ టైటిల్ నెగ్గి, జాతీయ క్రీడల్లో ఫైనల్స్ చేరడం లాంటి సానుకూల అంశాలతో ఇంగ్లీష్ టైటిల్​ గెలవాలని పట్టుదలగా ఉంది.

2015లో సైనా రన్నరప్​గా వెనుదిరిగింది. ఇటీవల జరిగిన జాతీయ ఛాంపియన్​షిప్​లో నెగ్గిన సైనా టోర్నీలో.. గట్టిపోటీ ఇవ్వనుంది. రెండో రౌండ్ వరకు సులభంగా చేరగలిగినా.. అక్కడ ప్రపంచ అగ్ర క్రీడాకారిణి తైజుంగ్​తో తలపడాలి. తైజూ చేతిలో సైనా వరుసగా 12 సార్లు పరాజయం పాలైంది.

"ప్రస్తుతం భారత క్రీడాకారులు మంచి ఫామ్​లో ఉన్నారు. ఈ ఏడాది సైనా, సింధు, శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనలు చేశారు. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్​షిప్​లో సత్తా చాటుతారు" -- పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్

చివరిసారిగా ఈ టైటిల్​ను భారత్ 2001లో గెల్చుకుంది. పుల్లెల గోపిచంద్ ఈ ఘనత సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details