తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2019, 1:16 PM IST

Updated : Dec 21, 2019, 1:42 PM IST

ETV Bharat / sports

ఈ ఏడాది షట్లర్లకు చేదుగుర్తు.. నిరాశ పరిచిన స్టార్లు!

గతంలో తమ ఆటతో ఎంతోమంది దిగ్గజాలను మట్టి కరిపించిన భారత్​ బ్యాడ్మింటన్​ క్రీడా కారిణులు. 2019లో మాత్రం క్రీడా అభిమానులకు నిరాశ కలిగించారు. ఎన్నో  మధుర క్షణాలను పంచిన ఈ యువ షెట్లర్లు ఈ ఏడాది చేదు గుర్తులను మిగిల్చారు.

2019 badminton stars didnt play a satisfaction game
బ్యాడ్మింటన్ పతకాల వేటలో తుస్సుమన్న రాకెట్లు

బ్యాడ్మింటన్‌ అంటే గుర్తొచ్చేవి చైనా, థాయ్‌ల్యాండ్‌, జపాన్‌. క్రమేపి వాటి ఆధిపత్యం తగ్గింది. భారత్‌ ప్రపంచ అగ్రగామిగా ఎదిగింది. అందుకు కారణం సింధు, సైనా, శ్రీకాంత్‌, కశ్యప్‌, ప్రణయ్‌ వంటి షట్లర్ల విజయాలే. కాకలుతీరిన మహా యోధులను మట్టికరిపించి మనోళ్లు ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌, సూపర్‌ సిరీసులు, గ్రాండ్‌ప్రిలు కైవసం చేసుకున్న మధుర క్షణాలు మనందరికీ గుర్తే. 2019 మాత్రం ఒక చేదుగుర్తుగా మిగిలింది. ఎందుకో అంతర్జాతీయ వేదికలపై ఈసారి మన రాకెట్లు తుస్సుమన్నాయ్‌..

పీవీ సింధు

సింధుకు పల్లేర్లపై నడక

మెగాటోర్నీలంటే శివంగిలా చెలరేగే షట్లర్‌ పీవీ సింధు. తనదైన దూకుడుతో ప్రత్యర్థిని మట్టికరిపిస్తుంది. 2019లో మాత్రం కేవలం 2 పతకాలు సాధించింది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సాధించి తానో గొప్ప క్రీడాకారిణి అని నిరూపించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో బీవెన్‌ ఝాంగ్‌, క్వార్టర్స్‌లో తైజు ఇంగ్‌, సెమీస్‌లో చెన్‌ యూఫీ, ఫైనల్లో నొజొమి ఒకుహరను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది స్వర్ణం ముద్దాడింది.

ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్లో అకానె యమగూచితో తలపడి రజతానికి పరిమితమైంది. ఆ తర్వాత మరే టోర్నీలోనూ రాణించలేదు. ఎన్నడూ లేనిది చాలా పోటీల్లో తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ అదే బాటలో సాగి అందరికీ షాకిచ్చింది. ఎనిమిది సూపర్‌ సిరీసుల్లో రెండో రౌండ్‌లోపే వెనుదిరిగింది. 2019లో 47 మ్యాచులాడిన సింధు 30 గెలిచి 17 ఓడింది. ఆమె విజయాల శాతం 63గా ఉన్నప్పటికీ పతకాలు గెలిస్తేనే కదా అసలు మజా. ప్రస్తుతం ఆమె 6వ ర్యాంకులో ఉంది.

నెహ్వాల్‌కు నయ్‌

భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి పతకం అందజేసిన కీర్తి.. సైనా నెహ్వాల్‌ సొంతం. తన తెలివితేటలతో ప్రత్యర్థిని ఓడించే ఆమె 2019లో గెలిచింది ఒకే ఒక్క స్వర్ణపతకం. ఇండోనేషియా మాస్టర్స్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ గాయంతో తప్పుకోవడంతో విజేతగా నిలిచింది. ఆల్‌ఇంగ్లాండ్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడో రౌండ్లో వెనుదిరిగింది. వీటిని మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. రెండేళ్లుగా ఆమె ఆటలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విజయాల శాతం తగ్గింది. ఈ ఏడాది 33 మ్యాచులు ఆడగా 18 గెలిచి 15 ఓడింది. పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో కొన్ని సిరీస్‌లు ఆడలేదు. ప్రస్తుతం సైనా 11వ ర్యాంకులో ఉంది.

కిదాంబి శ్రీకాంత్‌

మిర్చీ కుర్రాడికీ ఘాటు!

బ్యాడ్మింటన్‌లో తిరుగులేని ఆటగాళ్లు డాన్‌, చెన్‌. తనదైన రోజున వారినీ ముప్పుతిప్పలు పెట్టించిన ఘనత గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌ సొంతం. అతడి దూకుడు అసమానం. మైదానంలో చిరుతలా కదులుతాడు. త్వరగా గాయాల బారిన పడటం అతడి బలహీనత. 2019లో శ్రీకాంత్‌ పసిడి పతకం ముద్దాడనేలేదు. సన్‌రైజ్‌ ఇండియా ఓపెన్‌ ఫైనల్లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. కెంటొ మొమొటా, విన్సెంట్‌, అక్సెల్‌సెన్‌ అతడిని సునాయాసంగా ఓడిస్తున్నారు. ఇండియా ఓపెన్‌ తుదిపోరులోనూ మొమొటా చేతిలోనే ఓడాడు. సూపర్‌ సిరీసుల్లో క్వార్టర్‌ దశ దాటలేకపోయాడు. 2019లో 39 మ్యాచులాడి 23 గెలిచాడు. 16 ఓడాడు. విజయాల శాతం 58. ప్రస్తుత ర్యాంకు 12.

కశ్యప్‌, ప్రణయ్‌.. ప్చ్‌

పారుపల్లి కశ్యప్‌ 2019లో కెనడా ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచాడు. సూపర్‌ సిరీసుల్లో క్వార్టర్‌ దశ దాటలేదు. ఈ ఏడాది 46 మ్యాచులు ఆడి 26 గెలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ రెండో రౌండ్లో లిన్‌డాన్‌కు 21-11, 13-21, 21-7తో షాకిచ్చాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌. సంచలన విజయంతో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన అతడికి ప్రపంచ నంబర్‌వన్‌ కెంటా మొమొటా అడ్డుకట్ట వేశాడు. అతడు మరే విజయాలు సాధించలేదు. 2019లో 30 మ్యాచుల్లో 14 గెలిచాడు. సాయి ప్రణీత్‌ ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆశలు రేపాడు. సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరాడు. అతడికీ మొమొటానే అడ్డుపడ్డాడు. జపాన్‌ ఓపెన్‌ సెమీస్‌లోనూ అతడే ఓడించాడు. స్విస్‌ ఓపెన్‌లో రజతం గెలవడం ఉపశమనం. ఈ ఏడాది 41 మ్యాచులాడి 23 గెలిచాడు.

డబుల్స్‌ ట్రబుల్స్‌

యువ ఆటగాళ్లు సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మ, లక్ష్యసేన్‌ భారీ విజయాలు సాధించనప్పటికీ సింగిల్స్‌లో భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నారు. ఇక మహిళలు, పురుషులు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫలితాలు అంతంత మాత్రమే. అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ రెండు రజత పతకాలు సాధించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ థాయ్‌ల్యాండ్‌ ఓపెన్‌, బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌లో స్వర్ణాలు, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రజతం కైవసం చేసుకుంది. పతకాలు కరవు కొంతైనా తీర్చింది.

Last Updated : Dec 21, 2019, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details