ఓటీటీల్లో సెన్సేషనల్ హిట్ అయిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 'మీర్జాపూర్ 2'ను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. 'బాయ్కాట్ మీర్జాపూర్2' అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై ఈ సిరీస్లో మున్నా త్రిపాఠి పాత్రలో నటించిన దివ్యేందు శర్మ తాజాగా స్పందించాడు. వ్యక్తిగత అభిప్రాయాలతో అభిమానులను ఇబ్బంది పెట్టొద్దని సూచించాడు.
"ఇది నన్ను పెద్దగా బాధపెట్టలేదు. కానీ, 'మీర్జాపూర్' సిరీస్కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది ఒక మూర్ఖత్వం. అలాంటి హ్యాష్ట్యాగ్లను ఉపయోగించడం మానుకోవాలి. అవి ముమ్మాటికి పెయిడ్ ట్రెండ్స్ అని నేను భావిస్తున్నా".
- దివ్యేందు శర్మ, 'మీర్జాపూర్' నటుడు
2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మీర్జాపూర్' తొలి భాగం ప్రేక్షకులలో విపరీతమై క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ వెబ్సిరీస్ ద్వారా తన జీవితం ఎంతగానో మారిపోయిందని అంటున్నాడు నటుడు దివ్యేందు శర్మ. "అది మాటల్లో వర్ణించలేని అనుభవం. నేను ఎక్కడికి వెళ్లినా మున్నా భయ్యా అంటూ ప్రతి ఒక్కరూ పలకరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అయితే ప్రజలు ఆప్యాయంగా పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని తెలిపాడు.
'మీర్జాపూర్'లోని ఓ నటుడు అలీ ఫజల్ గతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. దీంతో ఓ వర్గానికి సంబంధించిన వారు అలీ ఫజల్ నటించిన చిత్రాలను బహిష్కరించాలని సోషల్మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇతడు నటించిన 'మీర్జాపూర్ 2' అక్టోబరు 23న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆ వెబ్సిరీస్ను బ్యాన్ చేయాలంటూ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.