ఓ వ్యక్తి కేవలం రెండు తెలుగు అక్షరాలను తీసుకుని సాహిత్యానికి కొత్త రూపాన్నందించి పాటగా మలిచాడు. అందుకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించి ఈ లోకానికి పరిచయం చేశాడు. అతనే ప్రణవ్ చాగంటి. ఇతను ఓ రాప్ సింగర్. తెలుగు భాషపై మక్కువ ఉన్న ఈ యువ గాయకుడు... మాతృభాషకు జరుగుతోన్న అవమానాన్ని తట్టుకోలేక భాషను బతికించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి... అచ్ఛమైన తెలుగులో ర్యాపర్గా ప్రయాణం మొదలుపెట్టాడు.
వైవిధ్యమైన పాటలతో ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటోన్న ర్యాపర్ ప్రణవ్... ఇటీవల ఓ సరికొత్త ప్రయోగం చేశాడు. ప్రపంచంలోనే తొలిసారిగా 'న, మ' అనే రెండు అక్షరాలతో 'మోడ్రన్ దివ్యాక్షరి' పేరుతో పాటను విడుదల చేశాడు. వినేందుకు గమ్మత్తుగా ఉన్నా ఎంతో లోతైన అర్థాన్ని ఇచ్చేలా పాటను కూర్చాడు.