ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించింది 'వార్'. బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి ఇందులో సందడి చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాల్లో... వార్ మాత్రమే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అగ్రస్థానం సంపాదించుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చర్చనీయాశంగా మారింది.
సీక్వెల్ తప్పదా..!
చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా... సామాజిక మాధ్యమాల్లో మాత్రం సీక్వెల్పై వార్తలు వస్తున్నాయి.నిజానికి ఈ చిత్రాన్ని ఓ సిరీస్లా తీయాలని చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్కూ ఉందట. ఇందులో భాగంగానే చిత్ర క్లైమాక్స్లో మరో కథ మొదలవబోతుంది అన్నట్లుగానే ముగించినట్లు తెలుస్తోంది. తాజాగా 'వార్' 300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ... సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశాడు. 'వార్ 2' త్వరలోనే సెట్స్పైకి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
బాహుబలితోనే పోటీనా..!
వార్ సీక్వెల్లో హృతిక్తో పాటు సందడి చేసే మరో హీరో గురించి చర్చ కూడా జరుగుతోంది. తొలి భాగంలో హృతిక్తో పాటు యాక్షన్ హంగామా చూపించాడు టైగర్ ష్రాఫ్. అయితే ఇందులో అతడి పాత్రను ముగించేశాడు దర్శకుడు. కాబట్టి సీక్వెల్లో మరో హీరో కనిపించే అవకాశముంది. ఇప్పుడీ పాత్రకు జాన్ అబ్రహం, విద్యుత్ జమాల్ వంటి వారైతే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది స్టార్ హీరో ప్రభాస్నూ తీసుకుంటే అటు ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో కలిసొచ్చే అవకాశముంటుందని మరికొంత మంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు వ్యక్తపరచడం విశేషం.
ఇదే కారణమా..?
'వార్' ఉత్తరాదిలో మంచి వసూళ్లు దక్కించుకున్నప్పటికీ దక్షిణాదిలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అందుకే ఇలాంటి పాన్ఇండియా చిత్రంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోను తీసుకుంటే అది వసూళ్ల పరంగా ఎంతో కలిసొస్తుందని విశ్లేషణలు చేస్తున్నారు నెటిజన్లు.
ఇటీవలి 'సాహో'తో బాలీవుడ్లోనూ తన స్టామినా ఎలా ఉందో ఇప్పటికే రుచి చూపించేశాడు ప్రభాస్. ఆయన కూడా హిందీ చిత్రసీమలో నిలదొక్కుకునేందుకు హృతిక్ వంటి స్టార్ హీరోతో కలిసినా ఆశ్చర్యపోనక్కరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'వార్ 2' పై యష్రాజ్ ఫిలింస్ ఆలోచన ఎలా ఉందో తెలియనప్పటికీ... హృతిక్ - ప్రభాస్ల జోడీకి సినీప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.