ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు నందమూరి తారక రామారావు(ఎన్.టి.ఆర్). కానీ మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు కథను తెరకెక్కించాలన్న ఆయన చిరకాల వాంఛను మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. అసలు ఇంతకీ ఎన్టీఆర్కు అల్లూరి కథపై ఆసక్తి ఎలా కలిగిందంటే?
అలా అల్లూరి కథపై
1954లో పక్షిరాజా ఫిలిమ్స్ అధినేత ఎస్. శ్రీరాములు నాయుడు నిర్మించిన 'అగ్గిరాముడు'లో దాదాపు పదిహేను నిమిషాలపాటు సాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథా రూపకం ఉంది. ప్రముఖ బుర్రకథా కళాకారుడు నాజర్ తన బృంద సభ్యులు లక్ష్మినరసయ్య, రామకోటి, పెరియనాయకి, జయలక్ష్మిలతో కలిసి అభినయించిన ఆ కథా రూపకం 'శ్రీ విలసిల్లెడి తెలుగు దేశమున జననమందినాడా.. వినరా ఆంధ్రుడ మన్యసోదరుల వీరగాధ నేడు' అంటూ సాగుతుంది. ఈ బుర్రకథ సాగుతుండగా అల్లూరి సీతారామరాజు వేషంలో రామారావు కొద్దిసేపు కనిపిస్తారు. ఆ పాత్ర రామారావును ఎంతగానో కదిలించి వేసింది. వెంటనే అల్లూరి సీతారామరాజు పేరుతో సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చేశారు.
పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా..
ఆ రోజుల్లో 'అల్లూరి' జీవితం ఆధారంగా.. పడాల రామారావు రచించిన నాటకం విస్తృత ప్రచారంలో ఉండేది. దానినే అనేక కళాసమితుల్లో నాటకంగా ప్రదర్శించేవారు. ఆయనకే ఈ సినిమా స్క్రిప్టు రాసే బాధ్యతలను ఎన్టీఆర్ అప్పగించారు. అప్పట్లో రామారావు తన సొంత బ్యానర్ మీద 'జయసింహ' చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ సినిమా తరువాత అల్లూరి సీతారామరాజు చిత్రానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 1954 అక్టోబర్ 21న 'జయసింహ' సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. వాహినీ స్టూడియోలో అల్లూరి సీతారామ రాజు సినిమా కోసం తొలి పాటను 1957 జనవరి 17న రికార్డు చేశారు. 'హర హర హర మహా ఓంకార నాదాన... పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా' అంటూ సాగే ఈ పాటను పడాల రామారావు రాయగా టి.వి.రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, మాధవపెద్ది, ఎమ్.ఎస్. రామారావు, పిఠాపురం ఆలపించారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని రామారావు ప్రకటించారు.
స్క్రిప్టు విషయంలో అనుమానాలు
రామరాజు సమకాలికుడు మల్లుదొర అప్పట్లో పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనతో చర్చలు జరిపి కొన్ని సలహాలు స్వీకరించారు. అయితే స్క్రిప్టు విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు రావడం వల్ల విస్తృత పరిశోధనచేసి సినిమా తీద్దామని నిర్ణయించి 'పాండురంగ మహాత్మ్యం' చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా కూడా 1957 నవంబర్ 28న విడుదలై విజయవంతమైంది. ఈలోగా అల్లూరి సీతారామరాజు కథలో స్త్రీ పాత్రలు ఉండకపోవడం, వాటిని సృష్టిస్తే అవాస్తవికతకు ఆస్కారమిచ్చినట్లవుతుందని భావించి ఆ స్క్రిప్టును పక్కనపెట్టి 'సీతారామకల్యాణం' సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అదికూడా 1961 జనవరి 6న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కానీ సీతారామరాజు సినిమా మాత్రం వెలుగు చూడలేకపోయింది. ఆ విషయాన్ని ఎవరడిగినా రామారావు ఉద్వేగానికి గురయ్యేవారు.