తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2020, 7:13 AM IST

ETV Bharat / sitara

ఓటీటీల్లో హిట్టు మాట వినపడినట్లేనా!

లాక్​డౌన్​ కారణంగా థియేటర్లు మూతపడి దాదాపు ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారా అని కొన్ని నిర్మాణ సంస్థలు వేచి చూస్తుండగా.. మరికొన్ని సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. లాక్​డౌన్​ నుంచి అనేక చిత్రాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. అందులో హిట్టు అందుకున్న చిత్రాలు ఏవో తెలుసుకుందాం.

Were the movies released in OTT hit?
ఓటీటీల్లో హిట్టు మాట వినపడినట్లేనా!

జయాపజయాలు ప్రతి రంగంలోనూ సాధారణమే అయినా.. చిత్ర సీమలో విజయానికున్న ప్రాధాన్యం వేరు. ఇక్కడ హిట్టు మాటే స్ఫూర్తి మంత్రంలా పని చేస్తుంటుంది. ఒక్క సినిమా విజయం ఎన్నో చిత్రాలకు కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంటుంది. అద్భుత ప్రతిభావంతుల్ని, సరికొత్త కథల్ని వెండితెరకు కానుకగా అందిస్తుంటుంది. అందుకే ఈ రంగంలోని ప్రతిఒక్కరూ 'హిట్టుదేవోభవ' అంటూ నిద్రలోనూ కలవరిస్తుంటారు. బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటాలని పరితపిస్తుంటారు. కానీ, ఈ ఏడాది సినీ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టింది. వెండితెర వినోదాలకు సినీప్రియుల్ని దూరం చేసింది. ఈ తరుణంలోనే.. ఓటీటీ వేదికలు సినీ వినోదాలకు ప్రత్యామ్నాయాలుగా మారాయి. మరి ఈ ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాలపై హిట్టు మాట వినిపించుకున్న చిత్రాలెన్ని.. పరాజయాల్ని మూట కట్టుకున్న సినిమాలెన్ని? తెలుసుకుందాం పదండి..

'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' విజయాలు ఈ ఏడాది తెలుగు చిత్రసీమకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాయి. తర్వాత వచ్చిన 'అశ్వథ్థామ', 'హిట్‌', 'భీష్మ', 'పలాస' లాంటి చిన్నా పెద్ద చిత్రాలు ఆ హిట్టు బాటలోనే నడవడం వల్ల ఈ ఏడాది టాలీవుడ్‌కు తిరుగులేనట్లే అనుకున్నారు. కానీ, కరోనా దెబ్బకు ఈ ఆనందం మూడ్నెళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల మార్చిలో మూతపడిన థియేటర్లు ఇప్పటి వరకు మళ్లీ తెరచుకోలేదు. అసలు వెండితెరపై మళ్లీ కొత్త బొమ్మ ఎప్పుడు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో దర్శక నిర్మాతలకు, సినీప్రియులకు ఓటీటీ వేదికలే కాస్తో కూస్తో ఓదార్పునందించాయి. గత ఆర్నెళ్లుగా చిన్నాపెద్ద సినిమాలన్నీ వివిధ ఓటీటీ వేదికల ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

భానుమతి రామకృష్ణ

పెద్ద చిత్రాలు.. మిశ్రమ ఫలితాలు

ఇలా తెలుగు నుంచి నేరుగా ఓటీటీల్లోనే విడుదలైన వాటిలో 'అమృతారామమ్‌', 'లూజర్‌', 'రన్‌', 'పెంగ్విన్‌', 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా', '47 డేస్‌', 'లాక్డ్​', 'భానుమతి రామకృష్ణ', 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య', 'జోహార్‌', 'బుచ్బిబాబు కండ్రిగ', 'వి' లాంటి చిత్రాలున్నాయి. అయితే వీటిలో ఓటీటీ వేదికపై సత్తా చాటినవి మాత్రం 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా', 'భానుమతి రామకృష్ణ', సత్యదేవ్‌ నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' లాంటి చిన్న చిత్రాలే. భారీ అంచనాలతో విడుదలైన కీర్తి సురేశ్​ 'పెంగ్విన్‌', నాని 'వి' లాంటి పెద్ద చిత్రాలు మిశ్రమ ఫలితాల్ని దక్కించుకున్నా.. సినీప్రియుల్ని పెద్ద ఎత్తున ఓటీటీ వైపు ఆకర్షితుల్ని చేయడంలో విజయం సాధించాయి.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

డబ్బింగ్​ సినిమాలు

ఓటీటీ వేదికలపై తెలుగు సినిమాలతో పాటు..'ఫోరెన్సిక్‌', 'ట్రాన్స్‌', '36 వయసులో', 'లాక్‌ అప్‌', 'మగువలు మాత్రమే', 'బంగారు తల్లి' లాంటి పలు అనువాద చిత్రాలూ సందడి చేశాయి. వీటిలో 'ట్రాన్స్‌', 'ఫోరెన్సిక్‌' మినహా మిగిలినవి మిశ్రమ ఫలితాన్నే అందుకున్నాయి. నిజానికి బాక్సాఫీస్‌ ముందు ఓ చిత్ర విజయానికి వసూళ్ల లెక్కలు, ప్రేక్షకులు - సినీ విశ్లేషకుల నుంచి దక్కిన ఆదరణ..ఇలా అనేక కొలమానాలున్నాయి. కానీ, ఓటీటీ వేదికలపై అసలు వసూళ్ల లెక్కల ఊసే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడికి కాస్తో కూస్తో లాభం సంపాదించుకున్నారా? లేదా? అంత వరకే.

ఇప్పుడిక్కడ విజయం ఓటీటీ వేదికలకే కీలకంగా మారింది. ఓ సినిమా తీసుకోవడం వల్ల తమ డిజిటల్‌ ప్లాట్‌ఫాంకు కొత్తగా ఎంత మంది వీక్షకులొచ్చారు? ప్రేక్షకులు ఎన్ని గంటలు తమ మాధ్యమాల్లో గడుపుతున్నారు? అనే దాన్ని బట్టి ఆయా సంస్థలు ఆ చిత్ర విజయాల్ని అంచనా వేసుకుంటున్నాయి. కానీ, ఈ విషయాల్ని ఇప్పటి వరకు ఏ ఓటీటీ సంస్థ ప్రకటించుకోవడం లేదు. ఒకవేళ ఇదే జరిగుంటే.. రూ.వందల కోట్ల వసూళ్ల హంగామా చూసిన తెలుగు చిత్రసీమలో మిలియన్‌ వ్యూస్‌ పోస్టర్ల సందడి దర్శనమిచ్చుండేదేమో!

వి సినిమా

రానున్న మూడ్నెళ్లూ మరింత కీలకం..

ఓటీటీ వేదికలకు రానున్న మూడ్నెళ్ల కాలం చాలా కీలకంగా మారనుంది. థియేటర్లు తెరచుకుని, ప్రేక్షకులు మళ్లీ వెండితెర వినోదాలకు అలవాటు పడితే.. ఓటీటీ వేదికలకు ఇప్పుడున్నంత ఆదరణ మళ్లీ దక్కకపోవచ్చు. అందుకే ఈ కొద్ది సమయంలోనే వీలైనంత త్వరగా తమ డిజిటల్‌ వేదికల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్ని తమ వలలో వేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

కృష్ణ అండ్​ హిస్​ లీలా

ఇప్పటికే 'ఒరేయ్‌ బుజ్జిగా', 'కలర్‌ ఫొటో' లాంటి చిత్రాల్ని 'ఆహా' ఓటీటీ కొనుగోలు చేసేసింది. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అనుష్క 'నిశ్శబ్దం', కీర్తి సురేశ్​ 'మిస్‌ ఇండియా', 'గుడ్‌లక్‌ సఖీ' చిత్రాలూ ఓటీటీలోకే రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన, తుది దశ చిత్రీకరణలో ఉన్న వాటిలో 'అరణ్య', 'రెడ్‌', '30రోజుల్లో ప్రేమించటం ఎలా', 'ఉప్పెన', 'సోలో బ్రతుకే సో బెటరు', 'క్రాక్‌', 'లవ్‌స్టోరీ', 'శ్రీకారం' తదితర చిత్రాలున్నాయి. మరి వీటిలో ఓటీటీల్లో విడుదలయ్యేవెన్ని? థియేటర్లలో సందడి చేసేవెన్ని? అన్నది తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details