కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మనం చేదును రుచి చూస్తున్నాం. కానీ త్వరలోనే తీపిని రుచి చూస్తామని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. తెలుగు సంవత్సరాది పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండి, శార్వరి నామ సంవత్సరాదిని కుటుంబసభ్యులతో సరదాగా జరుపుకోవాలని కోరారు.
"అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తుకువచ్చేది పచ్చడి. జీవితంలో తీపి, చేదు రెండు ఉంటాయనే సందేశాన్ని అది మనకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా సమస్య మనకు చేదును రుచి చూపిస్తుంది. జీవితంలో ఇది ఓ భాగం. త్వరలోనే తీపి రుచి చూస్తాం. ఆరోజులు మళ్లీ రావాలంటే అందరూ తప్పకుండా ఇంట్లోనే ఉండండి. అత్యవసరానికి తప్ప బయటకు రాకండి. ఈ ఏడాది ఉగాదిని ఇంట్లోనే ఆనందం, ఆరోగ్యంగా జరుపుకోండి."
- సుధీర్ బాబు
"అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కరోనా కల్లోలం త్వరగా తొలగిపోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. మీ కుటుంబం, స్నేహితుల గురించి ఆలోచించి బయటకు రాకండి. లవ్ యూ ఆల్. శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు."
- అడివి శేష్
"ప్రకృతిని కాపాడుకోండి, పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లిపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వందేళ్లు క్షేమంగా ఉండాలని ఆ షిర్డీ సాయినాథుడిని కోరుకుంటున్నాను."
- మోహన్ బాబు