తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేది ఎప్పుడు?

దేశవ్యాప్తంగా నేటి(అక్టోబరు 15) నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. తెలుగు ప్రేక్షకులు, తెరపై సినిమా చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

By

Published : Oct 15, 2020, 6:59 AM IST

Unlock 5.0: Cinema halls reopening from October 15 across India
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేది ఎప్పుడు?

ఏడు నెలలుగా సినీ వినోదానికి దూరమైన ప్రేక్షకులకు తియ్యటి కబురు. లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి భారతీయ తెరపై బొమ్మ పడుతోంది. నేడే చూడండి... మీ అభిమాన థియేటర్లో... అంటూ ఇక నుంచి పోస్టర్లు ఊరించనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 15 నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో థియేటర్లు తెరుచుకోవచ్చని ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దాదాపు 15 రాష్ట్రాలు అనుమతులిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, తెలంగాణ ఇవ్వలేదు. ఏపీ సినీ ప్రదర్శనకారుల సంఘం మాత్రం గురువారం నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ కాలానికి థియేటర్ల విద్యుత్‌ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

మల్టీప్లెక్స్‌లు సిద్ధం

దేశవ్యాప్తంగా 3100 మల్టీప్లెక్స్‌ థియేటర్లు ఉన్నాయి. వీటి యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే థియేటర్లను ముస్తాబు చేశాయి. ఒక సీట్‌ వదిలి మరో సీట్‌లో ప్రేక్షకుడు కూర్చుని సినిమా ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. 22 రాష్ట్రాల్లో 875 థియేటర్లను నిర్వహిస్తున్న పీవీఆర్‌ సంస్థ దాదాపు 14 రాష్ట్రాల్లో 500 థియేటర్లలో గురువారం నుంచి సినిమాల్ని ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ సంస్థకు అధికంగా స్క్రీన్‌లు ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాలేదు. సినీ పొలిస్‌ నిర్వహిస్తున్న 350 స్క్రీన్లలో 75 శాతం స్క్రీన్‌లపై ప్రదర్శనలు మొదలయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఐనాక్స్‌, సినీ ప్లెక్స్‌, కార్నివాల్‌ తోపాటు ఇతర మల్టీప్లెక్స్‌ సంస్థలూ తమ థియేటర్లను సిద్ధం చేశాయి.

తెలుగు రాష్ట్రాల మాటేమిటి?

తెలుగు సినిమాకు కీలకమైన సంక్రాంతిలోపు థియేటర్ల వ్యవస్థ గాడిన పడాలంటే ఇప్పుడు తెరవాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. నవంబరు 1 నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినీ ప్రదర్శనకు అనుమతులు లభిస్తాయనే ఆశతో ఉన్నామని ఓ ప్రదర్శనకారుడు చెప్పారు. ఏపీలో అనుమతులు లభించినప్పటికీ విద్యుత్‌ బిల్లులు, ఆస్తిపన్ను, జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఉపశమనం కల్పించాలని ప్రదర్శనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.

చిత్రాల్ని విడుదల చేయడం కోసం నిర్మాతల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడింగ్‌ సంస్థలు కూడా రాయితీల్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌లో నిర్మాతల నుంచి 50 శాతం మాత్రమే వసూలు చేయనున్నట్టు క్యూబ్‌ ప్రకటించింది.

మళ్లీ విడుదల

మలంగ్ సిినిమాలోని సీన్

హాళ్లు తెరిస్తే ప్రదర్శించడానికి సినిమాలు కావాలిగా? అందుకే బాలీవుడ్‌ నిర్మాతలు కొందరు తమ చిత్రాలను రీ రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారు. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ఆ చిత్రబృందం ప్రకటించింది. అలాగే అజయ్‌దేవగణ్‌ ‘తానాజీ’, తాప్సీ ‘తప్పడ్‌’, ఆదిత్యరాయ్‌ కపూర్‌, దిశాపటానీ నటించిన ‘మలంగ్‌’, ఆయుష్మాన్‌ఖురానా ‘శుభ్‌ మంగళ్‌ జాదా సావధాన్‌’, హృతిక్‌రోషన్‌, టైగర్‌షరాఫ్‌ నటించిన ‘వార్‌’, సుశాంత్‌సింగ్‌ ‘కేదర్‌నాథ్‌’ లాంటి చిత్రాలు మళ్లీ విడుదలకు సిద్ధమయ్యాయి.

ఇది చదవండి:తెరుచుకోనున్న థియేటర్లు.. ప్రేక్షకులు వస్తారా?

ABOUT THE AUTHOR

...view details