తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు నిర్వాహణ ఛార్జీల విషయంలో కొన్నిరోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరదించుతూ నిర్మాతల మండలి తమ నిర్ణయాన్ని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకూ డిజిటల్ ఛార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లిస్తారని స్పష్టం చేసింది. అలాగే డిజిటల్ సర్వీసు ఛార్జీల విషయంలో వచ్చే ఏడాది మార్చి 31లోపు ఒప్పందం జరిగే అవకాశముందని చెప్పంది. ఇతర రాష్ట్రాల్లో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లతో జరుగుతున్న చర్చల్లో వచ్చే నిర్ణయాలను తెలుగు పరిశ్రమలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు సినీపరిశ్రమ తిరిగి ప్రారంభించడానికి సర్వీసు ప్రొవైడర్లు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ సమస్య
లాక్డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి తెరిచే విషయంలో నిర్మాతలు, యజమానులకు మధ్య కొద్దీ రోజులుగా వివాదం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోతామని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణపై నిర్మాతల మండలి షరతులు పెడుతూ అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో నిర్మాతల ఎంపిక ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని, సాయంత్రం 4 గంటలు, 7 గంటలు, రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా చిన్న సినిమాలను ప్రదర్శించాలని నిబంధనలు పెట్టారు. అలాగే థియేటర్ల నిర్వహణ ఛార్జీలను నిర్మాతలకు విధించవద్దని, ఆన్లైన్ టికెట్ బుకింగ్పై వచ్చే ఆదాయంతో పాటు ప్రదర్శన మొత్తంపై 60 శాతం వాటా ఇకపై నిరంతరం నిర్మాతలకు చెల్లించాలని కోరారు. తమిళనాడు తరహాలో థియేటర్లన్నీ తెలుగు సినిమాలను 60 శాతం, ఇతర భాషా చిత్రాలను 40 శాతం మాత్రమే ప్రదర్శించాలని సూచించారు. ఇలా మొత్తం 11 నిబంధనలు పేర్కొంటూ అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.