కాలానికి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడమే తెలుసు.. కానీ, సినిమా భవిష్యత్తును ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తుందో... గతాన్నీ అంతే చక్కగా కళ్లకు కడుతుంది. ప్రేక్షకుల్ని టైమ్ మిషన్ ఎక్కించేసి అటూ ఇటూ తిప్పుతూ, ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రస్తుతం తెలుగులో తీస్తున్న పలు చిత్రాలు అదే లక్ష్యంతోనే ముస్తాబవుతున్నాయి. ఓ హీరో రాజుల కాలంలోకి తీసుకెళ్లబోతున్నాడు. ఇంకో ఇద్దరు స్వాతంత్య్ర సమరంలో ప్రేక్షకుల్ని భాగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి చరిత్ర లోతుల్లో నుంచి వెలికితీస్తున్న ఆ కథలేంటి?
రామ్చరణ్-పవన్ కల్యాణ్-ప్రభాస్
చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు, అమర చిత్ర కథల్లో కనిపించిన రాజ్యాలు ఆసక్తిని రేకెత్తించేవే. అలా ప్రేక్షకుల్ని ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో రాటుదేలారు అగ్ర దర్శకుడు రాజమౌళి. 'మగధీర', 'బాహుబలి' సినిమాలతో అదే ప్రయత్నం చేసి ప్రేక్షకులకు వినోదం పంచాడు. ఆయన సినిమాలు చూస్తే అప్పట్లో జీవితాలు ఇలాగే ఉండేవేమో కదా అనిపిస్తుంది. మరో దర్శకుడు క్రిష్ చరిత్రపై మక్కువ ప్రదర్శిస్తుంటాడు. ఆ నేపథ్యంలో కథల్ని అల్లుతూ ప్రేక్షక లోకాన్ని పలుమార్లు టైమ్ మిషన్ ఎక్కించేశారు. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'మణికర్ణిక' చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడీ ఇద్దరు అగ్ర దర్శకులు మరోసారి కాలాన్ని వెనక్కు తిప్పి చారిత్రక కథలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్'తో తొలి స్వాతంత్య్ర సంగ్రామం రోజుల్లోకి తీసుకెళ్లబోతున్నాడు రాజమౌళి. కల్పిత కథతోనే తీస్తున్న ఈ చిత్రంలో కొమరం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ దర్శనమిస్తారు. కథరీత్యా ఇది 1920నాటి పరిస్థితులకు తగ్గట్లుగా సాగుతుందని సమాచారం. అందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ను తీర్చిదిద్ది ఆ నేపథ్యంలోనే చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కాబోతుంది. క్రిష్.. మరోసారి ప్రేక్షకుల్ని గతంలోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా, ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం.. చారిత్రక కథాంశంతోనే ముస్తాబవుతోన్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం.