2020... ఎన్నో జ్ఞాపకాల్ని, మరెన్నో భావోద్వేగాల్ని, ఇంకెన్నో విషాదాల్ని భారంగా మోసుకుంటూ నిష్క్రమించింది నిన్నటి సూర్యాస్తమయంలా..! అయితే... రంగుల ప్రపంచంలో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్న సినీతారలు కొత్త ఏడాది నేపథ్యంలో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
గ్యాంగ్తో గోవాలో
కొత్త యేడాదికి స్వాగతం పలికేందుకు తన స్నేహితులతో కలిసి గోవా వెళ్లింది రష్మిక మందన్న. నా గోవా గ్యాంగ్తో కలిసి ఒక అందమైన ప్రదేశంలో గడుపుతున్నానని ఇన్స్టా ద్వారా ఆమె చెప్పింది. సెలవుల కోసం ఆ గ్యాంగ్తో కలిసి తరచూ అక్కడికే వెళుతుంటుంది రష్మిక. కొత్త యేడాది సందర్భంగా తీసుకున్న నిర్ణయాలంటూ ఏమీ లేవని చెప్పుకొచ్చిందామె. '2020 కోసం చేసుకున్న తీర్మానాలు ఏమయ్యాయో తెలుసుగా?' అంటూ నవ్వేసింది రష్మిక. "సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయింది. నా జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని అందరికీ తెలుసు. ఇది కొత్త యేడాది. కలలు కనండి. చేయాలనుకున్నది చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి" అంటూ సెలవిచ్చింది రష్మిక.
గంగా తీరాన
చాలా యేళ్ల తర్వాత అమ్మానాన్నలతో కలిసి కొత్త యేడాదికి స్వాగతం చెబుతున్నా అంటోంది లావణ్య త్రిపాఠి. సంబరాల కోసం తల్లిదండ్రులతో కలిసి, గంగానది తీరంలోని ఓ రిసార్ట్కి వెళ్లింది లావణ్య. "అమ్మానాన్నలతో కలిసి గడిపేందుకు ఇంతకుమించిన అందమైన ప్రదేశం మరొకటి ఉండదేమో" అంటూ కొత్త యేడాది ప్రణాళికల్ని వివరించింది.
"2020 చాలా విషయాల్ని నేర్పింది. ముఖ్యంగా జీవితం ఎంత చిన్నదో, ఇక్కడ మనం ఎంత బాధ్యతగా ఉండాలో అర్థమయ్యేలా చేసింది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది. ఒక రకంగా గతేడాది నేర్చుకున్న కొత్త పాఠాలతో, ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నట్టుగా ఉంది. యోగా చేయడం మొదలు పెట్టా. ఆ అలవాటుని కొనసాగిస్తా" అని చెప్పింది.