కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు జలమయమయ్యాయి. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం.. సోమవారం మళ్లీ మొదలైంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిస్థితి ఇదంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోమవారం మధ్యాహ్నం ఫొటోలు ట్వీట్ చేశారు. ఆయన ఇంటి ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. కాలనీ మొత్తం జలమయమైనట్లు కనిపిస్తోంది. 'మోటర్ బోట్ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి' అని మరో ట్వీట్ చేశారు.
వరద నీటిలో బ్రహ్మాజీ ఇల్లు.. ఏ బోటు కొనాలి అని ట్వీట్ - బ్రహ్మాజీ తాజా వార్తలు
తన ఇంటి కింద భాగంలో వరద నీరు ఉందని ఫొటోలు పోస్ట్ చేశారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. దీంతో ఫాలోవర్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
బ్రహ్మాజీ ఇంటి ఫొటోలు చూసిన నెటిజన్లు తెగ స్పందించారు. 'అయ్యో.. పడవ కొనాలి అన్నా, మీకు ఈత వస్తే ఫర్వాలేదు, వర్షాలు ఇంకా వస్తాయని నిపుణులు చెబుతున్నారు, చిరునామా చెప్పు అన్నా.. బోట్ వేసుకుని వచ్చేస్తా..' అంటూ రకరకాల కామెంట్లు చేశారు.
బ్రహ్మాజీ గత కొన్ని రోజులుగా 'అల్లుడు అదుర్స్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడు. సోనూసూద్, ప్రకాశ్రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్. ఈ సినిమా చిత్రీకరణ శంషాబాద్లో జరుగుతోందని రెండు రోజుల క్రితం బ్రహ్మాజీ చెప్పారు.