The Kashmir Files: ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై సూపర్హిట్గా నిలిచింది 'ద కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన హత్యకాండకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమాని పూర్తి చేయటం అంత సులభమేమీ కాలేదంటున్నారు నిర్మాతలు. త్రివర్ణ పతాకాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేయటం వంటి దృశ్యాల చిత్రీకరణ సమయంలో సెట్ల వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తి పెద్ద సవాలుగా మారినట్లు చెప్పారు. ఈ అంశంపై పలు విషయాలను ఈటీవీ భారత్తో చెప్పారు ద కశ్మీర్ ఫైల్స్ లైన్ ప్రొడ్యూసర్ పర్వ్ బాలి.
" కశ్మీర్ లాల్చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఉగ్రవాదులు దూరంగా పడేసే సన్నివేశాన్ని ముస్సోరిలోని లాల్తిబ్బా ప్రాంతంలో తీశాం. దానిని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. అలాంటి దృశ్యాలను ఏ భారతీయుడు సహించడు. ముస్సోరీ ప్రజలను ఒప్పించేందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకు ఏ ఒక్కరూ అంగీకరించేందుకు సిద్ధపడలేదు. ఆ సమయంలో ఏం జరుగుతోందనేది అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఒక్కరు కూడా లేరు. అలాగే.. 1990లో కశ్మీర్ లోయలో జరిగిన ఉగ్ర చర్య సందర్భంగా కశ్మీర్ సెంటిమెంట్ను పునర్నిర్మించేందుకు గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాయటమూ.. ఆందోళనలకు దారి తీసింది."
- పర్వ్ బాలి, ద కశ్మీర్ ఫైల్స్ లైన్ ప్రొడ్యూసర్
సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న క్రమంలో చిత్రీకరణలో ఎదుర్కొన్న ఇబ్బందులను నిర్మాతలు మర్చిపోయారు. చాలా రాష్ట్రాల్లో సినిమాకు వినోద పన్ను రద్దు చేశారు. ఆనాటి హింసకాండను పునర్నిర్మించినందుకు ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు.