కథానాయికల పాత్ర సినిమాల్లో కాస్తో కూస్తో మార్పు కనిపిస్తోంది. వాళ్లని కేవలం గ్లామర్కే పరిమితంగా చూడడం లేదు. వాళ్లకంటూ కథలో కొంత ప్రాధాన్యం దక్కుతోంది. అలా ఉంటేనే నాయికలూ ఒప్పుకుంటున్నారు. ఇది నిజంగా మంచి పరిణామమే. 'మజిలి', 'డియర్ కామ్రేడ్', 'ఓ బేబీ', 'సైరా'... ఇలా కథానాయిక పాత్రల్ని సరిగా డిజైన్ చేసుకున్న సినిమాలెన్నో కనిపిస్తాయి. వాటిలో పేరున్న కథానాయికలు నటించడం వల్ల ఆయా పాత్రలకు మరింత వన్నె వచ్చింది. సినిమాల సంఖ్య ఎక్కువ అవ్వడం, కథానాయకులు కూడా పెరగడం వల్ల హీరోయిన్ల డిమాండ్ మరింత ఎక్కువ అవుతోంది. దాంతో కొత్తతరం అమ్మాయిలకూ విరివిగా అవకాశాలొస్తున్నాయి.
బేబీ టూ జానూ
సమంత హవా 2018లో బాగా కనిపించింది. 'రంగస్థలం', 'యూటర్న్' వంటి విజయాలతో దూసుకుపోయింది. ఈ ఏడాది కూడా తనకు బాగా కలిసొచ్చింది. తమిళంలో నటించిన 'సూపర్ డీలక్స్' సమంతకు విమర్శకుల ప్రశంసల్ని తీసుకొచ్చింది. 'మజిలి', 'ఓ బేబీ' సినిమాలు నటిగా మరో నాలుగు మెట్లు ఎక్కించాయి. 'మజిలి'లో ఓ సగటు గృహిణిగా కనిపించిన సామ్.. 'ఓ బేబీ'లో విభిన్న పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ఈ రెండు పాత్రలూ కొత్త సమంతని ఆవిష్కరించేలా చేశాయి. ఇక 'మన్మథుడు 2'లో అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం '96' రీమేక్లో శర్వానంద్తో కలిసి నటిస్తోంది. 2020లోనూ తన కెరీర్ని సరిగానే ప్లాన్ చేసుకుంటోంది సమంత.
మిల్కీ బ్యూటీ హవా
2019లో బిజీగా ఉన్న మరో కథానాయిక తమన్నా. ఈ ఏడాది సంక్రాంతి సందడంతా తమన్నాదే. 'ఎఫ్ 2' విజయంతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాయికా ప్రాధాన్యం ఉన్న 'అభినేత్రి 2'లో నటించి అందరినీ మెప్పించింది. ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలైంది. 'పెట్రొమాక్స్' అనే తమిళ సినిమా చేసింది. 'సైరా'లో కీలక పాత్ర పోషించింది. 2020 సంక్రాంతి సీజన్లోనూ 'సరిలేరు నీకెవ్వరు'లో ప్రత్యేక గీతంలో కనిపించనుంది. 'దటీజ్ మహాలక్ష్మి'తో పాటు ఓ హిందీ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
అందాల తార కాజల్
కాజల్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. 'సీత', 'రణరంగం' చిత్రాలు కాజల్ ఆశించిన ఫలితాల్ని తీసుకురాలేకపోయాయి. అయితే తనకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. కమల్హాసన్ 'భారతీయుడు 2'లో కాజల్ ఎంపికైంది. 'బయి సాగా' అనే ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది. మంచు విష్ణు సరసన నటిస్తున్న 'మోసగాళ్లు' ప్రస్తుతం సెట్స్పై ఉంది.
నిశ్సబ్దంగా ఉన్న స్వీటీ
దక్షిణాదిన అగ్ర తారగా కొనసాగుతున్న అనుష్క ఈ ఏడాది మరీ నల్లపూసైపోయింది. తన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 'సైరా నరసింహారెడ్డి'లో మాత్రం అతిథి పాత్రలో కనిపించింది. తన కొత్త సినిమా 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.