కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. అయితే కొందరు మాత్రం తమ చిత్రాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనిపై కొంత సందిగ్ధం నెలకొంది. అయితే తమిళ హీరో సూర్య మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారట.
జ్యోతిక ప్రధాన పాత్రలో హీరో సూర్య నిర్మించిన చిత్రం 'పొన్మగల్ వంధాల్'. లాక్డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయాలని సూర్య భావించారు. ఒప్పందం కుదుర్చుకోవడమూ జరిగిందట. అయితే సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియో సందేశం కూడా పంపారు.