షూటర్ చంద్రో తోమర్ (89) నేడు కరోనాతో కన్నుమూశారు. ఈ వారం ప్రారంభంలో ఈమెను మీరట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె మృతిపై సంతాపం తెలిపారు బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, తాప్సీ.
"చంద్రో దాదీ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. నాలోని ఓ భాగం చనిపోయినంత బాధగా ఉంది. తను కన్నకలలు నిజం చేసుకుని చాలామంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన గురించి తెలుసుకోవడం, తన పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నా."
-భూమి పెడ్నేకర్, నటి
అలాగే నటి తాప్సీ.. చంద్రో మృతిపై సంతాపం తెలిపింది. "మీరు మాకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు. మీరు బతకడానికి ధైర్యం అందించిన చాలామంది అమ్మాయిల హృదయాల్లో చిరకాలం మీరు జీవించే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అంటూ పోస్ట్ చేసింది.
షూటర్లు చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్ జీవితాధారంగా 'సాండ్ కీ ఆంఖ్' అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో చంద్రో పాత్రను భూమి పెడ్నేకర్ పోషించగా, ప్రకాషీ పాత్రలో తాప్సీ మెప్పించింది. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్లోని జోహ్రీ గ్రామంలో జన్మించారు.