ఓటీటీ వేదికగా విడుదలై ఇటీవల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'. భారత నావికా దళంలో చేరిన తొలి భారతీయ మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రానికి.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో జాన్వి కపూర్, పంకజ్ త్రిపాఠి.. తండ్రి, కుమార్తెలుగా అద్భుతమైన నటన కనబరిచారు. వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయత అనురాగాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా సినిమాను రూపొందించారు దర్శకుడు శరణ్ శర్మ.
కథేమిటంటే..
ఆర్మీ కుటుంబానికి చెందిన యువతి గుంజన్. చిన్నప్పటి నుంచి విమానం నడపాలనేది ఆమె కల. కానీ ఆ కోర్సు చాలా ఖరీదైంది కాబట్టి.. తన తండ్రి సూచన మేరకు ఐఏఎఫ్లో చేరాలని నిశ్చయించుకుంటుంది. ఆమె సోదరుడు, తల్లి గుంజన్ కెరీర్ ఎంపిక విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. తండ్రి మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తుంటాడు. తన కుమార్తె కలను నెరవేర్చేందుకు నిరంతరం తపిస్తుంటాడు.ఇలా తండ్రి, కుమార్తెల మధ్య చక్కటి అనుబంధంతో కూడిన కథతో ఇంతకుముందు దక్షిణాదిలోనూ పలు సూపర్హిట్ సినిమాలు తెరకెక్కాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
రామ్ దర్శకత్వంలో 2018లో వచ్చిన తమిళ చిత్రం 'పెరంబు'. మమ్ముట్టి, సాధన ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ సినిమా సాగుతుంది. కథలోకి వెళ్తే మొదట్లో తండ్రి, కుమార్తెల మధ్య సన్నిహిత్యం అంతగా కనిపించదు. అయితే, భార్య విడిచిపెట్టి వెళ్లిన తర్వాత పాపను చూసుకొనే బాధ్యత తండ్రిపై పడుతుంది. అప్పటి నుంచి చిన్నారికి అన్నీ తానై చూసుకుంటాడు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం 1990లో తెరకెక్కించిన చిత్రం 'అంజలి'. మానసిక వైకల్యం ఉన్న ఒక చిన్నపిల్ల(షామిలి) చుట్టూ సినిమా నడుస్తుంది. పుట్టుకతోనే అనారోగ్యంపాలై.. కొన్ని నెలల్లో చనిపోయే అవకాశం ఉందని చిన్నారి తండ్రి(రఘువరన్)కు వైద్యులు చెబుతారు. అయితే, కుటుంబ సభ్యులు బాధపడకుండా ఉండేందుకు పాప పుట్టలేదని చెప్పమని వైద్యులు అతనికి సూచిస్తారు. కానీ, చివరి వరకు తండ్రే పాపను కంటికిరెప్పలా చూసుకుంటాడు.
బోయిన్నా సుబ్బారావు 2001లో దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రేమించు'. ఒక అంధ మహిళ గురించి ఈ సినిమా రూపొందించారు. లయ హీరోయిన్. తన వైకల్యాన్ని లెక్క చేయకుండా స్వశక్తితో న్యాయవాది వృత్తిని చేపడుతుంది లయ. ఆ ప్రయాణంలో తనకు నిత్యం తోడుగా నిలిచిన తన తండ్రికి కృతజ్ఞురాలిగా ఉంటుంది. వైకల్యంతో పుట్టిన పాపను వదిలేయడంపై తల్లిదండ్రుల మధ్య గొడవ చెలరేగి విడాకులు తీసుకుంటారు. అప్పటి నుంచి చిన్నారి బాగోగులు తండ్రే చూసుకుంటాడు.
అరుణ్రాజా కామరాజ్ దర్శకత్వంలో 2018లో వచ్చిన తమిళ క్రీడా చిత్రం 'కనా'. ఐశ్వర్యా రాజేశ్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెటర్ కావాలనుకునే ఓ యువతి కథే ఈ సినిమా. ఇందులో తండ్రి క్రికెట్ ప్రేమికుడు.. అతని వల్లే కుమార్తెకు క్రీడపై ఆసక్తి కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా తన కుమార్తె ఆశయాలకు మద్దతుగా నిలుస్తూ.. కంటికి రెప్పలా చూసుకుంటాడు.