తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Sirivennela died: ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ఇకలేరు

By

Published : Nov 30, 2021, 4:30 PM IST

Updated : Nov 30, 2021, 5:16 PM IST

siri vennela sitaramasastry died
siri vennela sitaramasastry died

16:28 November 30

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

Sirivennela Sitaramasastri died: ప్రముఖ గేయ రచయిత 'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి(66) తుదిశ్వాస విడిచారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంలో 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడం వల్ల ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ, ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడం వల్ల అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటం వల్ల రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు.

తమ్ముడు గుర్తించిన టాలెంట్‌

సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు 'అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు' అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో 'సిరివెన్నెల' చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు.

11సార్లు నంది అవార్డు

సీతారామశాస్త్రి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో, అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట 'విధాత తలపున'కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రిది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు.

Last Updated : Nov 30, 2021, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details