హీరోగా జీవాను తెలుగువారికి ఎంతగానో చేరువ చేసిన చిత్రం 'రంగం'. కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించిన 'కో' అనే కోలీవుడ్ చిత్రాన్ని తెలుగులో 'రంగం' పేరుతో విడుదల చేశారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2011లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. అయితే ఈ సినిమాలో మొదట శింబుని హీరోగా తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో షూట్ ప్రారంభం కానుందనగా శింబు-కార్తికలపై ఫొటోషూట్స్ కూడా పూర్తి చేశారు. సినిమాలో చూపించే బాంబుదాడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే మరికొన్ని రోజుల్లో ఒరిజినల్ షూట్ పట్టాలెక్కనుందనగా అనుకోని కారణాల వల్ల శింబు 'కో' టీమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో దర్శకుడు ఆనంద్.. జీవాని ప్రధాన పాత్రలో తీసుకుని ఆ సినిమా తెరకెక్కించారు. కాగా, 'కో' విడుదలైన పదేళ్ల తర్వాత తాజాగా శింబు-కార్తిక ఫొటోషూట్లకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.
కారణం అదేనా?
'కో' నుంచి శింబు తప్పుకోవడానికి అప్పట్లో ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి. దర్శకుడితో ఓ విషయంలో విభేదాలు రావడం వల్లనే శింబు ప్రాజెక్ట్ నుంచి వైదొలగారని చెప్పుకున్నారు. హీరోయిన్ కార్తిక తనకు సరైన జోడీ కాదని భావించిన శింబు.. ఆమె స్థానంలో తమన్నాను కథానాయికగా పెట్టమని చిత్రబృందాన్ని కోరారట. తమన్నాకు భారీగా పారితోషికం చెల్లించాలని.. అంత బడ్జెట్ తమవద్ద లేదని నిర్మాతలు చెప్పడం వల్ల చేసేదిలేక శింబునే ఆ ప్రాజెక్ట్ వద్దనుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఈ కాంబో రావాల్సింది..కానీ!
'కో' విడుదలై ఆనంద్ కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా మారారు. ఈ క్రమంలోనే శింబుతో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని ఆయన ఆశించారు. శింబు కూడా ఆయనతో సినిమా పట్టాలెక్కించాలని భావించారు. ఈక్రమంలోనే ఆనంద్ ఇటీవల శింబుకి ఓ కథ కూడా చెప్పారట. కథ నచ్చడం వల్ల వెంటనే ప్రాజెక్ట్ని శింబు ఓకే చేసేశారు. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటిద్దామనుకున్న సమయంలో అనారోగ్యంతో ఆనంద్ కన్నుమూశారు.