తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 2:55 PM IST

ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు: శ్రద్ధా​ కపూర్​, సారా​లకు సమన్లు!

బాలీవుడ్​లో డ్రగ్స్​ కేసులో విచారణ నిమిత్తం బాలీవుడ్​ హీరోయిన్లు శ్రద్ధాకపూర్​, సారా అలీఖాన్​లను ఎన్​సీబీ సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుశాంత్​ ప్రియురాలు రియా సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

Shraddha Kapoor, Sara Ali Khan
శ్రద్ధా కపూర్​, సారా

బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా యువ నటీమణులు శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌సింగ్‌ కేసు విచారణలో భాగంగా బయటపడ్డ డ్రగ్స్​ సరఫరా అంశంలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే అతని సన్నిహితురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టు చేసింది. అంతకుముందు మూడు రోజులపాటు రియాను విచారించగా ఆమె పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటపెట్టింది. అందులో శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ వారికి త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ (34) జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రియా చక్రవర్తి తన కుమారుడిని మానసికంగా వేధించిందని, బ్యాంకు ఖాతా నుంచి కోట్లలో డబ్బు బదిలీ చేసుకుందని నటుడి కుటుంబం కేసు పెట్టింది. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఎన్‌సీబీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. రియా వాట్సాప్‌ చాట్‌లో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా లాంటి పలు విషయాలు బయటపడటం వల్ల ఆమెను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ప్రస్తుతం నటి ముంబయిలోని ఓ కారాగారంలో ఉంది. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్‌ను, పలువురు సుశాంత్‌ సిబ్బందిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. వారు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details