తెలంగాణ

telangana

Shekhar Kammula Movies: 'లవ్​స్టోరి' కథ అలా పుట్టిందే..

By

Published : Sep 21, 2021, 7:04 AM IST

శేఖర్ కమ్ముల(Shekhar Kammula Movies) దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరి'.ఈ సినిమా ఈనెల 24న(Love Story Release Date) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు శేఖర్​ కమ్ముల మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

Shekhar Kammula
శేఖర్ కమ్ముల

సున్నితమైన ప్రేమకథలతో ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ములది(Shekhar Kammula Movies) అందెవేసిన చేయి. ఆయన చిత్రాలన్నీ మంచి కాఫీలా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. జ్ఞాపకాల ఊసుల్లో హాయిగా ఊరేగిస్తుంటాయి. ఇప్పుడాయన తన మెగాఫోన్‌తో వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అందమైన ప్రేమకథ 'లవ్‌స్టోరి'(Love Story Release Date). నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. నారాయణ దాస్‌.కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 24న(Love Story Release Date) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు శేఖర్‌ కమ్ముల.

'లవ్‌స్టోరి'కథకు 'లీడర్‌' సినిమాతోనే బీజం పడింది. ఆ చిత్రంలో నేనెక్కువ ఫోకస్‌ చేసింది రాజకీయాల్లోని అవినీతినే. రాజకీయాల్లో నాణేనికి మరోవైపు కులం ఉంటుంది. ఆ సినిమాలో దాన్ని కాస్త టచ్‌ చేసి వదిలేశాను. ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో స్పృశిస్తూ ఓ చిత్రం చేయాలని అప్పటి నుంచే అనుకుంటుండేవాడ్ని. నిర్భయ ఘటన తర్వాత లింగ వివక్షపైనా చర్చించాలి అనిపించింది. చాలా రోజులుగా నా మనసులో నానుతూ వస్తున్న ఇలాంటి అంశాలన్నింటి నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన కథే 'లవ్‌స్టోరి'.

నా కథలన్నీ అలా పుట్టినవే..

'నేను పుస్తకాలు చదువుతా.. ఆ కథల్ని ఆస్వాదిస్తా. అలాగని వాటి నుంచి ఓ కథ రాయాలని అనుకోను. సినిమాలైనా అంతే. నచ్చితే చూస్తా.. దాన్ని అక్కడితోనే వదిలేస్తా. నా కథలు.. అందులోని భావోద్వేగాలు.. అన్నీ నేను చుట్టూ చూసిన జీవితాల నుంచే తీసుకుంటుంటా. అందరూ 'మీకంటూ ఓ మార్క్‌.. స్టైల్‌ ఉంది' అంటుంటారు. నిజానికి వాటిని నేనసలు నమ్మను. ఏ దర్శకుడైనా తన మార్క్‌ ఇది. ఇలాగే తీయాలని చూడరు. భావోద్వేగభరితంగా కథనం ముందుకు నడిపించగలిగితే.. ఎవరు ఏ కథ తీసినా అందంగానే ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు వాళ్లను వాళ్లు మర్చిపోయి తెరపై పాత్రలతో ప్రయాణం చేసేలా చేయగలగాలి. అలా చేసి చూపగలిగితే చాలు.. ఏ దర్శకుడైనా విజయం సాధించినట్లే'.

అలాంటి కథలు రావాలి..

'ఇటీవల వస్తున్న చిత్రాల్లో తెలుగు భాషలోని వివిధ యాసల సొగసు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జానపదాలు వినిపిస్తున్నారు. కథలకు మట్టి పరిమళాలు అద్దుతున్నారు. ఇది మంచి పరిణామం. నిజానికి ఇదెప్పుడో జరగాల్సింది. భాష, యాసలతో పాటు అందులోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలు.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదోడు, రైతులు ఇలా ప్రతిఒక్కరి జీవితాల్ని వాస్తవికంగా ఆవిష్కరిస్తూ న్యాయం చేసే కథలు మరిన్ని రావాలి. ఈ పరిణామం ఇప్పటికే వేరే భాషల్లో ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ ఆ ఒరవడిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలంగాణ యాసపై పట్టుంది. అందుకే నా చిత్రాల్లో తెలంగాణ సొగసు ఎక్కువ కనిపిస్తుంది'.

విభిన్నమైన జానర్‌లో ధనుష్‌

'దర్శకుడిగా ఇలాంటి సినిమాలు చేయాలని ప్రత్యేకంగా కలలేమీ లేవు. ఓ కథ మదిలో మెదిలిందంటే చాలు.. ఇక అదే నా కల. దాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ప్రస్తుతం నా దృష్టంతా ధనుష్‌తో చేయనున్న సినిమాపైనే ఉంది. ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ జానర్‌లో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలవుతుంది. 'లీడర్‌' సినిమాకు సీక్వెల్‌ చేయాలన్న ఆలోచన ఉంది. కచ్చితంగా చేస్తా. అలాగని తొలి భాగానికి కొనసాగింపులా ఉండదు. ఈసారి మరో కొత్త కథ చెప్తా. రానాతో పాటు తొలి భాగంలో ఉన్న పాత్రలతోనే ఆ సీక్వెల్‌ రూపొందిస్తా. అయితే అది ఎప్పుడు చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేను'.

'నేనే కాదు.. ఎవరైనా తమ చిత్రాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. 'లవ్‌స్టోరి'లో ఆ షేడ్స్‌ ఉన్నాయి. అలాగే నేను ప్రతి సినిమాను.. అందులోని సన్నివేశాల్ని ఇంతకు మించి ఎవరూ తీయలేరు అన్నట్లుగా చెయ్యాలని ప్రయత్నిస్తా. ఎందుకంటే ఓ పదేళ్ల తర్వాత నా పిల్లలకు నాచిత్రాలు గర్వంగా చూపించగలగాలి అనుకుంటా'.

అకస్మాత్తుగా పరిష్కారం దొరకదు

సమాజంలోని అసమానతలు, కుల వివక్ష వంటివి ఈ మధ్య మొదలైనవి కావు. ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నాయి. వాటికి అప్పటి నుంచి దొరకని పరిష్కారం.. ఇప్పుడు అకస్మాత్తుగా దొరికేస్తుందనైతే అనుకోను. నిర్భయలాంటి ఘటనలు బయటకొచ్చినప్పుడు 'అయ్యో' అని స్పందించేవారు. కానీ, ఇప్పుడివన్నీ మనుషుల జీవితంలో అలవాటు అయిపోతున్నాయి. ఇంకా ఎంత కాలం ఇది తప్పు అని చెప్తూ కూర్చుంటాం. ఏదో పెద్ద సునామి వచ్చేసి.. అందరూ కొట్టుకుపోయి కొత్త మనుషులు పుడితే కానీ ఇవన్నీ మారతాయేమో చూడాలి'.

చైతూ.. సాయిపల్లవి కనిపించరు

'నాకు నాగచైతన్యలో లవర్‌బాయ్‌ ఇమేజ్‌ కన్నా.. నిజాయతీనే ఎక్కువ కనిపిస్తుంటుంది. నా కథలో రేవంత్‌ పాత్రకు ఎలాంటి లక్షణాలుండాలో అవన్నీ చైతూలో ఉన్నాయనిపించింది. అందుకే ఈ చిత్రానికి తననే హీరోగా తీసుకోవాలనుకున్నాం. మౌనిక పాత్రకు మొదటి నుంచీ సాయిపల్లవినే అనుకున్నాం. తనకెంతో అనువుగా ఉండే బలమైన పాత్ర ఇది. సినిమాలో డ్యాన్స్‌ నేపథ్యం ఉంటుంది. దీనికి తోడు చైతూ - సాయిపల్లవి జోడీ తెరపై కొత్తగా, అందంగా కనిపిస్తుందనిపించింది. తెరపై రేవంత్‌, మౌనికల పాత్రలే కనిపిస్తాయి తప్ప.. చైతన్య, సాయిపల్లవి ఎక్కడా కనిపించరు.

ఇదీ చదవండి:టీజర్​తో 'రౌడీబాయ్స్​'.. 'పెళ్లి సందD' ట్రైలర్​కు టైమ్ ఫిక్స్

ABOUT THE AUTHOR

...view details